బషీర్బాగ్, వెలుగు: దేశాభివృద్ధికి, అట్టడుగు వర్గాల సంక్షేమానికి దిశానిర్దేశం చేసిన మహనీయుల జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం బషీర్బాగ్ చౌరస్తాలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 5న బాబు జగ్జీవన్ రామ్, 14న డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, స్పీకర్, దళిత ప్రజాప్రతినిధులు పాల్గొంటారని వివరించారు.
దళిత సంఘాల నాయకులతో కూడిన ప్రత్యేక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ కో-చైర్మన్లు డి. సుదర్శన్ బాబు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య, పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
