
- ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహంపై వివాదం
- శ్రీకృష్ణుడి గెటప్లో ఏర్పాటుకు మంత్రి అజయ్ ప్రయత్నాలు
- వ్యతిరేకిస్తున్న యాదవ సంఘాలు
- కమ్మ ఓట్ల కోసమే అని విమర్శలు
- ఈ నెల 28న విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు
ఖమ్మం, వెలుగు : ఖమ్మం సిటీలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు వివాదాస్పదమవుతున్నది. లకారం ట్యాంక్ బండ్ వద్ద 54 అడుగుల ఎత్తయిన ఎన్టీఆర్ స్టాచ్యూని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఏర్పాటు చేయాలనుకున్నారు. తానా సభ్యులు, ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తల సహకారం అందించారు. రూ.4 కోట్లతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా దీన్ని ఆవిష్కరించాలని నిర్ణయించారు. అయితే, ఈ విగ్రహం శ్రీకృష్ణుడి గెటప్ లో ఉండటం వివాదానికి కారణమవుతున్నది. తాము దేవుడిగా కొలిచే శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఎన్టీఆర్ రూపంలో ఏర్పాటు చేయడాన్ని యాదవ సంఘాలు తప్పుబడుతున్నాయి. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, శ్రీకృష్ణుడి గెటప్ లో మాత్రం వద్దని సూచిస్తున్నాయి. ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి టైంలో శ్రీకృష్ణుడికి నివాళులర్పించడం ఆ దేవుడిని అపవిత్రం చేయడమేనని యాదవ సంఘాల నేతలు చెబుతున్నారు. ఎన్టీఆర్ వేసిన ఏ గెటప్లో అయినా విగ్రహాన్ని పెట్టుకోవచ్చని, శ్రీకృష్ణుడి వేషాధారణలో ఉన్నది మాత్రం వద్దని అంటున్నారు. విగ్రహ ఏర్పాటును నిలిపివేయాలంటూ హైదరాబాద్ నుంచి వచ్చిన యాదవ సంఘాల ప్రతినిధులు ఖమ్మం మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు.
ఖిల్లా ఏరియాలో ఏర్పాటుపైనా అభ్యంతరం
శ్రీకృష్ణుడి గెటప్లో ఎన్టీఆర్ విగ్రహం ఉండటంతో ముస్లింలు కూడా అభ్యంతరం చెబుతున్నారు. ఖిల్లా ఏరియాను ఆనుకొని ఉన్న లకారం ట్యాంక్ బండ్ మీద ఒక సామాజిక వర్గానికి చెందిన విగ్రహాన్ని అంత పెద్ద స్థాయిలో ఏర్పాటు చేయడం తమకు కూడా అభ్యంతరకరమేనని అంటున్నారు. మరోవైపు విగ్రహ ఆవిష్కరణ కోసం జూనియర్ ఎన్టీఆర్ను మంత్రి పువ్వాడ అజయ్ ఆహ్వానించారు.