
- సంస్కరణలకే కాకుండా పునరావాసానికీ వేదికగా జైళ్ల శాఖ
- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కామెంట్
- జైళ్ల శాఖను దేశంలోనే రోల్ మోడల్గా నిలపాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- ముగిసిన ప్రిజన్స్ డ్యూటీ మీట్
హైదరాబాద్, వెలుగు: జైలువ్యవస్థ భద్రతకే పరిమితం కాకుండా సంస్కరణలు, పునరావాసానికి కూడా వేదికగా మారుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. వివిధ నేరాల్లో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీల్లో సత్ర్పవర్తన తెచ్చి వారిని సమాజంలోకి పంపాలన్నారు. రాష్ట్ర పోలీస్ అకాడమీలో ఈ నెల 9న ప్రారంభమైన ఆలిండియా ప్రిజన్స్ డ్యూటీ మీట్- 2025 గురువారం ముగిసింది.
తెలంగాణ జైళ్ల శాఖ, బీపీఆర్ అండ్ డీ సంయుక్తంగా నిర్వహించిన ఈ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బండి సంజయ్, విశిష్ట అతిథిగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, డీజీపీ జితేందర్, జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా, నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్ గార్గ్ సహా పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంజయ్ మాట్లాడుతూ ఆలిండియా ప్రిజన్ డ్యూటీ మీట్లో అత్యధిక ట్రోఫీలతో తెలంగాణ జైళ్ల శాఖ జాతీయ స్థాయిలో కీర్తి చాటిందన్నారు.
జాతీయ స్థాయి జైళ్ల శాఖ పోటీలను సౌమ్యా మిశ్రా ఘనంగా నిర్వహించారని కొనియాడారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో అంశాల్లో సంస్కరణలతో ముందుకు వెళుతున్న తెలంగాణ జైళ్ల శాఖను దేశవ్యాప్తంగా రోల్ మోడల్గా నిలపాలన్నారు. జాతీయ స్థాయిలో డ్యూటీ మీట్ను విజయవంతంగా నిర్వహించినందుకు తెలంగాణ జైళ్ల శాఖను రాష్ట్ర ప్రభుత్వం తరపున అభినందిస్తున్నామని తెలిపారు.
జైళ్లశాఖ డీజీ సౌమ్యా మిశ్రా మాట్లాడుతూ.. డ్యూటీ మీట్లో 21 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 1300 మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. జైళ్లు సంరక్షణ కేంద్రాలు మాత్రమే కాదని, పగిలిన గుండెల్ని జోడించే ప్రదేశాలన్నారు. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఆధునిక జైళ్ల నిర్మాణంతోపాటు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ ట్రైనింగ్ పాలసీ తెచ్చామని బీపీఆర్ అండ్ డీ అడిషనల్ డీజీ రవిజోసెఫ్ లోకూర్ తెలిపారు. కాగా.. ఆయా విభాగాల్లో గెలుపొందిన జట్లకు బండి సంజయ్, పొంగులేటి ట్రోఫీలు బహూకరించారు.
తెలంగాణ జైళ్ల శాఖ నంబర్ వన్
ప్రిజన్స్ డ్యూటీ మీట్లో ఓవరాల్ చాంపియన్గా తెలంగాణ జైళ్ల శాఖ సత్తా చాటింది. అన్ని అంశాల్లో కలిపి మొత్తం 28 పతకాలు సాధించగా.. అందులో 21 బంగారు, నాలుగు వెండి, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి. 17 పతకాలతో తమిళనాడు రెండో స్థానంలో, 16 పతకాలతో మహారాష్ట్ర మూడో స్థానంలో నిలిచాయి.