
- మంత్రి దామోదరకు అధికారుల రిపోర్టు
హైదరాబాద్, వెలుగు: గత రెండేండ్లతో పోలిస్తే, ఈ ఏడాది మలేరియా, డెంగీ, టైఫాయిడ్ తదితర కేసులు బాగా తగ్గాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు అధికారులు వివరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖాన్ల పనితీరు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం సెక్రటేరియట్లో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
హెల్త్ సెక్రటరీ, డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గతేడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకూ చికున్గున్యా కేసులు 361 నమోదవగా, ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకూ 249 కేసులు మాత్రమే నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో నిరుడు 226 మలేరియా కేసులు నమోదవగా, ఈ ఏడాది 209 కేసులు మాత్రమే వచ్చాయన్నారు. ఈ మేరకు అధికారులు మంత్రికి నివేదిక అందజేశారు. దీంతో మంత్రి దామోదర అధికారులను అభినందించారు.