కేజీబీవీని సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి
పాలకుర్తి/ దేవరుప్పుల, వెలుగు: బల్లి పడిన అన్నం తిని స్టూడెంట్లు అస్వస్థతకు గురైన ఘటనలో బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశించారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని కేజీబీవీని ఎర్రబెల్లి శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ శివలింగయ్యతో కలిసి సందర్శించారు. అన్నంలో బల్లి రావడంపై తీవ్ర ఆగ్రహం చేశారు. అస్వస్థతకు గురైన స్టూడెంట్లకు ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటని సిబ్బందిని నిలదీశారు.
స్కూల్ గదులను, ఆవరణ, పరిసరాలను పరిశీలించారు. స్టూడెంట్లతో కలిసి నేలపై కూర్చొని వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది లేట్గా వచ్చి సాయంత్రం 5 గంటలకు వెళ్లిపోతున్నారని, తామే అన్నం వడ్డించుకొని తింటున్నామని స్టూడెంట్లు మంత్రికి చెప్పారు. ఏ రోజూ భోజనం మంచిగా ఉండదని వివరించారు. అనంతరం సిబ్బంది, టీచర్లతో ఎర్రబెల్లి వేరువేరుగా సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై ఎంక్వైరీ చేసి దోషులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దేవరుప్పుల ఘటన నేపథ్యంలో మిగతా అన్ని స్కూల్స్, హాస్టల్స్ లో వంట మనుషులు, ఏజెన్సీలకు తగు సూచనలు ఇచ్చి, గట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు. రెగ్యులర్గా హాస్టల్స్ను పర్యవేక్షించాలని ఆదేశించారు.