బండి పాదయాత్ర ప్రారంభించిన  గజేంద్ర షెకావత్

బండి పాదయాత్ర ప్రారంభించిన  గజేంద్ర షెకావత్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర మొదలైంది. యాదగరిగుట్ట వంగపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ముగిసిన అనంతరం పాదయాత్ర ప్రారంభమైంది.  కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జెండా ఊపి బండి సంజయ్ పాదయాత్రను ప్రారంభించారు. 

తొలిరోజు యాదగిరిగుట్ట నుంచి ప్రారంభించి.. గంగసానిపల్లి, ముత్తిరెడ్డి గూడెం, బస్వాపూర్ వరకు యాత్ర సాగనుంది. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో.. మొదటి రోజు 10.5 కిలోమీటర్ల మేర యాత్ర ఉంటుంది. బస్వాపూర్ సమీపంలో మొదటిరోజు రాత్రి సంజయ్ బస చేస్తారు. రేపు హుస్సేన్ బాద్ రూరల్, భువనగిరి టౌన్, టీచర్స్ కాలనీల్లో... ఆగస్ట్ 4న గొల్లగూడెం, మగ్దూంపల్లి, పెద్దపలుగు తండా, చిన్న రావుల్పల్లి, గుర్రాలదండిలో 11.7కి.మీ. మేర యాత్ర ఉంటుంది. ఆగస్ట్ 7వ తేదీ వరకు మొత్తం భువనగిరి నియోజకవర్గంలోనే పాదయాత్ర సాగనుంది. ఆ తర్వాత మునుగోడు నియోజకవర్గంలోకి పాదయాత్ర ఎంటర్ అవుతుంది. 

మొత్తం 24రోజుల పాటు 328 కిలోమీటర్లు.. మూడో విడత ప్రజా సంగ్రామయాత్ర సాగనుంది. 5జిల్లాలు, 12 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ నెల 26న హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో బహిరంగ సభతో మూడో విడత యాత్ర ముగుస్తుంది. ముగింపు సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, లేదా జాతీయ కీలక నేతను ముఖ్య అతిథిగా తీసుకువచ్చే ఏర్పాట్లలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఉంది.