
- లవ్ మ్యారేజ్ చేసుకున్నా కల్యాణలక్ష్మి
- కులాంతర విహహాలకూ ఈ పథకం వర్తింపు
హైదరాబాద్ : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేయడంతో తెలంగాణలో బాల్య వివాహాలను అరికట్టగలిగామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ రెండు పథకాల కింద 10 లక్షల 26 వేల 396 మంది లబ్ధి పొందారన్నారు. బీసీ సంక్షేమం ద్వారా 4,87,346 మంది, గిరిజన శాఖ ద్వారా 1,21,639 మంది, మైనార్టీ శాఖ ద్వారా 2,10,676, ఎస్సీ శాఖ ద్వారా 2,06,735 మంది లబ్ధి పొందారని తెలిపారు. ఈ రెండు పథకాలకు మొత్తంగా రూ. 8,673.67 కోట్ల ఖర్చు చేశామని... బీసీ శాఖ ద్వారా రూ. 4,355 కోట్లు, గిరిజన శాఖ ద్వారా రూ. 975 కోట్లు, మైనార్టీ శాఖ ద్వారా రూ. 1,682 కోట్లు, ఎస్సీ శాఖ ద్వారా రూ. 1,660 కోట్లు ఖర్చు చేశామన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో బాల్య వివాహాలు అరికట్టగలిగామని చెప్పారు. ఈ విషయం నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో కూడా తేలిందని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.
కులాంతర విహహాలు, లవ్ మ్యారేజ్ చేసుకున్నా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వర్తిస్తుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. ప్రేమ పెళ్లి చేసుకన్న మహిళలు దర్జాగా ఈ పథకానికి అప్లే చేసుకోవచ్చని తెలిపిన మంత్రి.. ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకుని కూతరు ఇంట్లో నుంచి వెళ్లిపోయినా.. తల్లికి కూడా డబ్బులు ఇస్తామని తెలిపారు. కరోనా వచ్చి రాష్ట్రం ఆగమైనా ఎక్కడా కల్యాణలక్షి, షాదీముబారక్ ఆగలేదని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.