నిమ్స్లో మహిళలను పరామర్శించిన హరీష్ రావు

నిమ్స్లో మహిళలను పరామర్శించిన హరీష్ రావు

ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో కుటుంబనియంత్రణ ఆపరేషన్లు వికటించి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 30మంది మహిళలు ఆరోగ్యంగా ఉన్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇవాళ, రేపు కొంతమంది డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందన్నారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను ఆయన పరామార్శించారు. బాధితులతో మాట్లాడిన మంత్రి.. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. పేషంట్లు  పూర్తిగా కోలుకున్న తరువాతనే ఇంటికి  పంపించాలని డాక్టర్లకు చెప్పారు. 

ఈ ఘటనలో నలుగురు మహిళలు చనిపోవడం బాధాకరమని..ఇన్ఫెక్షన్ వల్లే మహిళలు చనిపోయారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని హరీష్ రావు తెలిపారు. గతంలో ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదని.. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హరీష్ రావు తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఆధారంగా దర్యాప్తు సాగుతోందన్నారు. పేషెంట్ సహాయకులకు ఇప్పటికే 10వేలు అందించామని..భవిష్యత్ లో మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.