రేవంత్ రెడ్డి ఊసరవెల్లులకే ఊసరవెల్లి : హరీశ్ రావు

రేవంత్ రెడ్డి ఊసరవెల్లులకే ఊసరవెల్లి  : హరీశ్ రావు

మెదక్, రామాయంపేట, వెలుగు : టీపీసీసీ ప్రెసిడెంట్​రేవంత్ రెడ్డి ఊసరవెల్లులకే ఊసరవెళ్లి అని, ఓట్ల కోసం ఎంతకైనా దిగజారి మాట్లాడుతాడని ఆర్థిక మంత్రి  హరీశ్ రావు విమర్శించారు. సోమవారం జిల్లాలోని  రామాయంపేట పట్టణంలో కొత్త రెవెన్యూ డివిజన్ ఆఫీస్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వలాభం కోసం పార్టీలు మార్చడం, మాటలు మార్చడం రేవంత్ రెడ్డి నైజం అన్నారు. అప్పుడు సోనియాగాంధీని బలిదేవత అని విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు దేవత అంటూ పొగడుతున్నారని ఎద్దేవా చేశారు.

వందలాది మంది చావుకి కారణమైన కాంగ్రెస్  నాయకులు తెలంగాణను ఉద్ధరిస్తారా అని ప్రశ్నించారు. సంక్రాంతికి గంగిరెద్దుల వాళ్ళు వచ్చినట్టు ఎలక్షన్ రాగానే కొందరు హైదరాబాద్ నుంచి డబ్బు సంచులతో వస్తున్నారని పరోక్షంగా మైనంపల్లిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.  మెదక్ లో ధనబలానికి, జనబలానికి మధ్య పోటీ జరగనుందన్నారు. తెలంగాణ ప్రత్యేక సాధన ఉద్యమంలో అలుపెరగకుండా పోరాడి మెదక్ జిల్లాను,  రైల్వే లైన్ ను, మెడికల్ కాలేజీ, రామాయంపేటకు రెవెన్యూ డివిజన్

డిగ్రీ కాలేజీ  సాధించిన పద్మా దేవేందర్ రెడ్డిని ఆశీర్వదించాలని, మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని మంత్రి హరీశ్ రావు కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఇఫ్కో  డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి,  ఏఎంసీ చైర్మెన్ యాదగిరి పాల్గొన్నారు.