
- వడ్లు అమ్మిన 72 గంటల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేస్తాం
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు : అత్యధికంగా వరి పండించే జిల్లాల్లో నల్గొండ రాష్ట్రంలోనే సెకండ్ ప్లేస్లో ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని కంకణాలపల్లి, అంతాయగూడెం, మామిడాలపల్లి గ్రామాల్లో శుక్రవారం ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వడ్లు అమ్మిన 72 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని, ఒక వేళ డబ్బులు డిపాజిట్ కాకపోతే డైరెక్ట్గా తనకే ఫోన్ చేయొచ్చని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తోందన్నారు. రైతులు ఎక్కువగా సన్న ధాన్యాన్ని పండించాలని సూచించారు. పేదలు సైతం సన్నబియ్యం తినాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తోందని చెప్పారు.
వడ్లను మిల్లులకు తరలించడం, ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ఇందుకు ట్రాన్స్పోర్ట్, లారీల యజమానులు సహకరించాలని కోరారు. అనంతరం కొనుగోలు పూర్తయిన వడ్లను తరలిస్తున్న లారీలను జెండా ఊపి ప్రారంభించారు. అలాగే కంకణాలపల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించగా, మర్రిగూడెంలో రేషన్ షాపును ఓపెన్ చేసి లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్డీవో శేఖర్రెడ్డి, డీఎస్వో వెంకటేశ్, సివిల్ సప్లై డీఎం గోపీకృష్ణ, డీసీవో పత్యానాయక్, డీసీసీబీ డైరెక్టర్ సంపత్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేశ్, మాజీ జడ్పీటీసీ పాశం రాంరెడ్డి
పాల్గొన్నారు.