
హైదరాబాద్, వెలుగు: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)ను అత్యుత్తమ స్కిల్ డెవలప్మెంట్ వేదికగా మార్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన న్యాక్ సీనియర్ ఇన్స్ట్రక్టర్ స్నేహలతను గురువారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.."యువతలో నైపుణ్యాలు పెంపొందించి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం.
సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. నల్గొండలో నిర్మిస్తున్న స్కిల్ సెంటర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది" అని వివరించారు. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ (ఎంఎస్డీఈ) విభాగం నుంచి 'ఉత్తమ టీచర్స్ అవార్డు'కు ఎంపికైన స్నేహలతను మంత్రి శాలువాతో సత్కరించారు.
దేశవ్యాప్తంగా 13 మంది మాత్రమే ఈ అవార్డుకు ఎంపికైతే..రాష్ట్ర తరపున స్నేహలతకు అవార్డు దక్కడం గర్వకారణమన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల విషయంలో ఆమె అందించిన సేవలను మంత్రి కొనియాడారు.