మంత్రి కొప్పులకు సుప్రీంలో చుక్కెదురు

మంత్రి కొప్పులకు సుప్రీంలో చుక్కెదురు
  • మంత్రి కొప్పులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
  • వీవీప్యాట్లను లెక్కించకపోవడంపై గతంలో హైకోర్టుకెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థి
  • ఆ పిటిషన్​ను తిరస్కరించాలన్న కొప్పుల అప్పీల్​కు  హైకోర్టు నో
  • తాజాగా అదే విషయంపై  సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ, వెలుగు : మంత్రి కొప్పుల ఈశ్వర్​కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్  రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. వీవీప్యాట్లు లెక్కించకుండానే కొప్పుల ఈశ్వర్ గెలిచినట్లు ప్రకటించడం ప్రజా ప్రాతినిధ్య చట్టానికి విరుద్ధమని పిటిషన్​లో లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆ పిటిషన్​ను తిరస్కరించాలంటూ మంత్రి కొప్పుల చేసిన అప్పీల్​ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొప్పుల ఈశ్వర్ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్​ను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్​తో కూడిన బెంచ్ బుధవారం విచారించింది. మంత్రి తరఫున అడ్వకేట్లు వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు ఉత్తర్వులలో లోపాలున్నాయని బెంచ్ దృష్టికి తెచ్చారు. ఆ వాదనలను బెంచ్ ఏకీభవించకపోవడంతో పిటిషన్ విత్ డ్రా చేసుకుంటామని లాయర్లు కోర్టుకు తెలిపారు. అందుకు అనుమతించిన కోర్టు పిటిషన్​ కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది.