మళ్లీ గెలిపించండి.. అన్ని హామీలూ అమలు చేస్తం: కేటీఆర్

మళ్లీ గెలిపించండి.. అన్ని హామీలూ అమలు చేస్తం: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు:  బీఆర్ఎస్​ను మళ్లీ గెలిపించాలని, మేనిఫెస్టోలో పెట్టిన అన్ని హామీలనూ అమలు చేస్తామని ఆ పార్టీ​ వర్కింగ్ ​ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​అన్నారు. కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యాక సౌభాగ్యలక్ష్మి పథకం కింద 18 ఏండ్లు నిండిన మహిళలకు నెలకు రూ.3 వేలు ఇస్తామన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్​లో ఖైరతాబాద్ బీజేపీ నాయకుడు గోవర్ధన్, హిమాయత్​నగర్ ​కార్పొరేటర్ ​మహాలక్ష్మి, తదితరులు బీఆర్ఎస్​లో చేరారు. కేటీఆర్ ​వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్​ను మళ్లీ గెలిపిస్తే తెల్ల రేషన్​కార్డులు ఉన్నవారికి సన్న బియ్యం ఇస్తామన్నారు. మేనిఫెస్టోలో అనేక సంక్షేమ పథకాలు ప్రకటించామని.. పింఛన్లు, రైతుబంధు పెంపు సహా అన్ని హామీలనూ అమలు చేస్తామన్నారు. హైదరాబాద్ నగరం న్యూయార్క్, దుబాయ్​ని మించిపోయేలా అభివృద్ధి చెందిందని సినీ ప్రముఖులు రజనీకాంత్, సన్నీ డియోల్, లయ వంటి వారు ఎంతో మంది మెచ్చుకున్నారన్నారు. 

దుబాయ్ కంటే హైదరాబాదే బాగుందని గంగవ్వ సైతం చెప్పిందని.. ఈ విషయం కాంగ్రెస్, బీజేపీ నాయకులకు మాత్రం తెలియడంలేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, నాయకులు కర్నె ప్రభాకర్, దాసోజు శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.