- కేంద్రం నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా సాధ్యం
- ఈ బడ్జెట్లోనైనా విభజన హామీలు అమలు చేయాలి
హైదరాబాద్: తెలంగాణ, ఏపీకి ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. గడిచిన ఏడున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని చెప్పారు. సోమవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమన్నారు. ఈ సారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్లోనైనా విభజన హామీలు అమలు చేయాలన్నారు. తెలంగాణలో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని, దేశంలో 4 పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఆయన చెప్పారు. కేంద్ర సర్కారు సహకరిస్తే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని.. డిమాండ్లను సాధించుకునేందుకు కేంద్ర సర్కారుపై పోరాటం చేస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్.