రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. దమ్ముంటే మంత్రి గంగుల కమలాకర్పై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా 1,067కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేటీఆర్.. మార్క్ ఫెడ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. కరీంనగర్ను సీఎం కేసీఆర్ లక్ష్మీనగరంగా చూస్తారని.. ఇక్కడ ప్రారంభించే ప్రతి పని విజయవంతం అవుతుందని నమ్ముతారని చెప్పారు.
కరీనంగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ తనను గెలిపించిన ప్రజల కోసం ఒక్క పని కూడా చేయలేదని కేటీఆర్ విమర్శించారు. వినోద్ కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ కు స్మార్ట్ సిటీ స్టేటస్ వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంపీగా గెలిచి మూడేండ్లు అయినా కరీంనగర్ పట్టణం కోసం కనీసం రూ.3కోట్ల పని కూడా చేయలేదని మండిపడ్డారు. కాళేస్వరం ప్రాజెక్టుకు కనీసం జాతీయ హోదా ఇవ్వాలని కనీసం ఒక్కసారి కూడా మాట్లాడలేదని కేటీఆర్ మండిపడ్డారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆసరా పెన్షన్ రూపంలో రూ.2016 ఇస్తూ వృద్ధుల్లో ఆత్మగౌరవం నింపిన ఘనత కేసీఆర్ సర్కారు సొంతమని కేటీఆర్ అన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు. మతంతో సంబంధంలేకుండా 18 ఏండ్లు నిండిన అమ్మాయిలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అమలు చేస్తున్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు.