సినిమా అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర వచ్చేది కాదని.. ప్రతిపక్షాలకు 2023లో అసలైన సినిమా చూపిస్తామన్నారు మంత్రి కేటీఆర్. ఈ సారి కూడా బ్రహ్మాండమైన విజయంతో మూడోసారి కేసీఆర్ సీఎం కాబోతున్నారని చెప్పారు. మతాలతో, కులాలతో సంబంధం లేకుండా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 50 ఏండ్లు అధికారం ఇచ్చినా ఏమిచేయని దుర్మార్గులు కొందరు.. కులమతాలతో అల్లర్లకు కుట్రలు చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇందిరాపార్క్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. గతంలో హైదరాబాద్ లో కర్ఫ్యూ ఉండేదని..ఇపుడు ఆ పరిస్థితి లేదన్నారు.
ఈ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం వల్ల దశాబ్దాల కల నెరవేరిందన్నారు కేటీఆర్. ఈ బ్రిడ్జ్ కు నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాలని కేసీఆర్ స్వయంగా చెప్పారన్నారు. కార్మికులకు అండగా నిలబడ్డ నాయకుడు, తెలంగాణ తొలి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డ అని కొనియాడారు.
2.63 కిలోమీటర్లు..రూ. 426 కోట్లు
ఇందిరా పార్క్ నుంచి VST వరకు 2.63 కిలోమీటర్ల మేర నిర్మించిన స్టీల్ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 426 కోట్లతో ఈ ఫ్లై ఓవర్ ను జీహెచ్ఎంసీ నిర్మించింది. 81 పిల్లర్లపై స్టీల్ ఫ్లై ఓవర్ నిర్మాణం చేశారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మించడం లో 12,316 మెట్రిక్ టన్నులు స్టీల్ ఉపయోగించారు. స్టీల్ ఫ్లై ఓవర్ కు నాయిని నర్సింహా రెడ్డి పేరు పెట్టారు. నగరంలోనే మెట్రో ట్రాక్ పై నుండి నిర్మించిన తొలి ఫ్లై ఓవర్. అత్యధిక ఎత్తులో ఈ స్టీల్ ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టారు. 2020 జూలైలో శంకుస్థాపన చేయగా.. మూడు సంవ్సరాలు పట్టింది.