సీబీఐకి అప్పగిస్తే సంబరమెందుకు ? : మంత్రి కేటీఆర్

సీబీఐకి అప్పగిస్తే సంబరమెందుకు ?  : మంత్రి కేటీఆర్

కేంద్ర దర్యాప్తు సంస్థలపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. సీబీఐ, ఈడీ, ఐటీలను కేంద్ర ప్రభుత్వం చేతిలోని కీలుబొమ్మలుగా అభివర్ణించారు. అవి సాగించే విచారణ ఎలా ఉంటుందో దేశంలో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఈమేరకు వ్యాఖ్యలతో మంగళవారం రాత్రి కేటీఆర్ వరుస ట్వీట్లు చేశారు. బీజేపీ బండారంపై నిజమైన ప్రజాక్షేత్రంలో విచారణ ఎప్పుడో పూర్తయిందన్నారు. ‘‘ సరైన సమయంలో మీపై తీర్పు చెప్పేందుకు యావత్ భారత సమాజం సిద్ధంగా ఉంది’’ అని  కేటీఆర్ కామెంట్ చేశారు. 

‘‘మీ దగ్గర విషయం లేదు కాబట్టే.. 8 ఏళ్లుగా ప్రత్యర్ధి పార్టీలపై దర్యాప్తు సంస్థలతో విష ప్రయోగం చేస్తున్న మాట నిజం కాదా ? మీ బీజేపీ నాయకత్వం దగ్గర సరుకు లేదు కాబట్టే .. ఎమ్మెల్యేలను అంగడి సరుకులా కొని.. రాష్ట్ర ప్రభుత్వాలను కూలుస్తున్న మాట వాస్తవం కాదా?’’ అని కేటీఆర్ మండిపడ్డారు. 

‘‘ సీబీఐ దర్యాప్తుతో పాటు.. దొరికిన దొంగలపై, బీజేపీ బ్రోకర్స్ పై నార్కో అనాలసిస్, లై డిటెక్టర్ టెస్టులకు కూడా సిద్ధమా ? మీరు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయగలరేమో కానీ.. శాస్త్రీయ పరీక్షల (సైంటిఫిక్ టెస్టు)ను ఎవరూ మార్చలేరు. ఏ మార్చలేరు. మా సవాల్ స్వీకరించే దమ్ముందా ? ’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. 

‘‘రెడ్ హ్యాండెడ్ గా దొరికి ఇప్పుడు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు ఉంది మీ వ్యవహారం.. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంలో మీరు కాంగ్రెస్ నే మించిపోయారు. ఒకప్పుడు సీబీఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేవాళ్లు. ఇప్పుడు సీబీఐని, కంట్రోల్డ్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అంటున్నారు’’ అని కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. 

‘‘మీకు ఏ సంబంధం లేకపోతే పలుమార్లు కోర్టుల్లో ఈ కేసు దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు మీరు ? సీబీఐకి అప్పగిస్తే అంత ఖుషీ ఎందుకు కిషన్ రెడ్డి గారు ? మీ మోడీ జేబు సంస్థ చేతికి కేసు చిక్కినందుకేనా ? ఈ పట్టలేనంత సంతోషం ?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. 

‘‘కిషన్ రెడ్డిగారూ.. మీకో సూటి ప్రశ్న. ఆ సాములతో అసలు సంబంధమే లేదన్నోళ్లు.. ఈ స్కాము సీబీఐకి అప్పగించగానే చంకలెందుకు గుద్దుకుంటున్నరు ? మీ బండారమంతా కెమెరా కన్నుకు చిక్కినప్పుడే.. మీ వెన్నులో వణుకు మొదలైంది. అప్పులు భుజాలు తడుముకున్న మీరు.. ఇప్పుడెందుకు వాళ్లను భుజాలపై మోస్తున్నారు ?’’ అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.