హైదరాబాద్, వెలుగు: పెరుగుతున్న జనాభా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సిటీల్లో సౌలతులు కల్పిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. గురువారం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (అస్కీ) ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. దీర్ఘకాలిక లక్ష్యాలతో పట్టణాలను తీర్చిదిద్దుతున్నామని, హైదరాబాద్లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రణాళికలో ఆదర్శ విధానాలు అనుసరిస్తున్న మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఎక్స్పర్ట్స్తో ఈ సందర్భంగా మంత్రి చర్చించారు. రాష్ట్ర అధికారులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులపై స్టడీ చేయాలని కేటీఆర్ సూచించారు. 6 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పట్టణాభివృద్ధిపై చర్చించారు. భవిష్యత్లోనూ ఇలాంటి సమావేశాలకు తాను హాజరవుతానని కేటీఆర్ తెలిపారు.
క్రీడాకారుడికి కేటీఆర్ సాయం
కోచ్ డిప్లొమా కోర్సులో అడ్మిషన్ కోసం ఎదురు చూస్తున్న క్రీడాకారుడికి మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. సిరిసిల్ల జిల్లా రాచర్లగుండారం గ్రామానికి చెందిన ముడావత్ వెంకటేశ్ అంతర్జాతీయ ఖోఖో పోటీల్లో రాణిస్తున్నాడు. జాతీయ క్రీడా సంస్థలో సీటు సంపాందించినప్పటికీ ..ఆయన ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నాడు. కేటీఆర్ స్ఫూర్తితో గిఫ్ట్ ఎస్మైల్లో భాగంగా టీఆర్ఎస్ యువజన విభాగం నేత ఉగ్గం రాకేశ్ యాదవ్ రూ.1.80 లక్షలు సమకూర్చారు. ఆ మొత్తాన్ని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా గురువారం బేగంపేట క్యాంప్ ఆఫీసులో వెంకటేశ్కు అందజేశారు.