తెలంగాణ ప్రభుత్వం దళిత, గిరిజనుల అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన కార్యాలయాన్ని మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్ కలిసి ప్రారంభించారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ కమిషన్ వెబ్సైట్ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలను భాగస్వాములను చేస్తూ ప్రభుత్వం ముందుకు పోతున్నదని అన్నారు. దేశంలో మూలధనంతోనే కులాన్ని రూపుమాపే అవకాశం ఉన్నదని, ఆ దిశగా సాధ్యమైనంత ఎక్కువ మంది దళిత, గిరిజన వర్గాల నుంచి యువకులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
సమాజంలో ఉన్న వాడు లేరు, లేనివారు అనే తేడా ప్రధానంగా మారిందని, ఆర్థికంగా అవకాశాలు లేని వారికి అవకాశాలు కల్పించే విధంగా పని చేస్తామన్నారు. ఎడ్యుకేషన్, ఏంత్రప్రెన్యూర్ షిప్, ఎంప్లాయిమెంట్ అనే 3 E ఈ సూత్రంతో నిమ్న వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు.