బీజేపీ లీడర్ల పై మంత్రి కేటీఆర్ సెటైర్లు

బీజేపీ లీడర్ల పై మంత్రి కేటీఆర్ సెటైర్లు

తెలంగాణ బీజేపీ నేతల పై మంత్రి కేటీఆర్ మరొసారి సెటైర్లు వేశారు. వరంగల్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో " నేడు జేపీ నడ్డా చెప్పులు మోసే గులామ్‌ ఎవరు" అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌ వేదికగా ఓ ప్రశ్న వేశారు. దీనికి తీవ్రమైన పోటీ ఉంటుందని ఖచ్చితంగా అనుకుంటున్నానని కేటీఆర్ వ్యంగ్యంగా తన ట్వీట్ లో పేర్కొన్నారు. 

కాగా ఇటీవల మునుగోడులో ఏర్పాటు చేసిన సభ కోసం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సికింద్రాబాద్‌ మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చిన అమిత్ షాకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పులు అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనితో బండి సంజయ్ పై టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఫైర్ అయ్యారు.  గుజరాత్‌ నాయకులకు ఉరికి ఉరికి చెప్పులు తొడగడం తెలంగాణ ఆత్మగౌరవమా? అంటూ ప్రశ్నించారు.