బాబు రాజకీయ వైకల్యంతో బాధ పడుతున్నారు : మంత్రి పెద్దిరెడ్డి

బాబు రాజకీయ వైకల్యంతో బాధ పడుతున్నారు : మంత్రి పెద్దిరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వస్తున్న వేళ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన వైసీపీకి లేదని చెప్పారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు రెండూ కలిసే వస్తాయి.. అప్పుడే ఎన్నికలకు వెళ్తామన్నారు. వైసీపీ బలంగా ఉందని.. తమకు వేరే పార్టీలతో పొత్తు అవసరం లేదని ఆయన చెప్పారు. చంద్రబాబు చంద్రబాబు రాజకీయ వైకల్యంతో బాధపడుతున్నారని.. అందుకే వేరే రాజకీయ పార్టీలపై ఆధారపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వేరే పార్టీల అండ కోసం తాపత్రయపడుతున్నారని విమర్శించారు.  2019 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తామని.. వారు కట్టబెట్టిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.

పవన్ గురించి ఏమీ మాట్లాడను: మంత్రి పెద్దిరెడ్డి

మరోవైపు పొత్తులపైనా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని.. తమకు వేరే పార్టీలతో పొత్తు అవసరం లేదని కుండబద్ధలు కొట్టారు. చంద్రబాబుకు 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని, అందువల్లే బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీ వెళ్లారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. టీడీపీ మహానాడులో విడుదల చేసిన మినీ మేనిఫెస్టోను ప్రజలు విశ్వసించరని వ్యాఖ్యానించారు. కర్ణాటక మేనిఫెస్టోను, వైసీపీ మేనిఫెస్టోను కాపీకొట్టి మేనిఫెస్టోను రూపొందించారని అన్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ గురించి  తానేం మాట్లాడనని ఈ సందర్భంగా చెప్పారు.