
కూసుమంచి, వెలుగు: ఏడాదిగా కూతురు కోమాలో ఉండడంతో చికిత్స చేయించలేక తండ్రి ఆత్మహత్య చేసుకోగా, ఆ కుటుంబానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అండగా నిలిచారు. వివరాలిలా ఉన్నాయి.. ధర్మతండా గ్రామానికి చెందిన జర్పుల పరుశురాం ఇటీవల సూసైడ్ చేసుకోగా, ఆయన కుటుంబాన్ని మంత్రి పొంగులేటి పరామర్శించారు. ఆయన కూతురు సింధు గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లిందని, ఆర్థిక స్థోమత సరిగా లేక పూర్తిస్థాయిలో వైద్యం అందించలేదనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా సింధుకు వైద్యం అందిస్తానని మంత్రి భరోసా ఇచ్చారు. ఇందులోభాగంగా సోమవారం మంత్రి సొంత ఖర్చులతో హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స కోసం అయ్యే ఖర్చు అంతా తానే భరిస్తానని చెప్పారు. ఖమ్మం ఎంపీ రఘరాంరెడ్డి దగ్గర ఉండి సింధుకు అందుతున్న వైద్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మంత్రి, ఎంపీకి ధన్యవాదాలు తెలిపారు.