
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను రాష్ట్ర, దేశ వ్యాప్తంగా నిలిచేలా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జూలై 7వ తేదీ శనివారం బేగంపేట హోటల్ హరితా టూరిజం ప్లాజాలో ఆషాఢ మాసం బోనాల దశాబ్ద ఉత్సవాలు 2024కి సంబంధించిన దేవాలయాల కమిటీలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్..అందరికీ ఆషాఢ మాస బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతా సమృద్ధిగా వర్షాలు పడి, మంచి పంటలు పండాలని ప్రజలంతా సంతోషాలతో ఉండలని అమ్మవారిని కోరుకుంటున్నామన్నారు. జూలై 7వ తేదీ నుండి గోల్కొండ బోనాలతో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. తెలంగాణ ఆషాఢ మాస దశాబ్ది బోనాల ఉత్సవాలను ఘనంగా జరపడానికి ప్రభుత్వం తరుపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని చెప్పారు. అధికారులను, స్థానిక దేవాలయాల కమిటీలను సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలు విజయవంతం అయ్యేలా చేస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా ఉత్సవాల విజయవంతానికి హైదరాబాద్ ప్రజల సహకారం కావాలని అన్నారు. ఏ విధమైన సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తరుపున అధికారులను ఆదేశించామన్నారు. శాంతి భద్రతలను కాపాడుతూ ఉత్సవాలను విజయవంతం చేయడానికి అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి అదనపు నిధులు తీసుకొచ్చారన్నారు. నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్త పడాలని సూచించారు.