సోమవారం ( నవంబర్ 17 ) సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంపై స్పందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ ఘటనలో మృతి చెందినవారిలో 16 మంది హైదరాబాద్ వాసులు ఉన్నారని తెలుసుకున్న మంత్రి పొన్నం.. సౌదీ అరేబియాలో ఉన్న ఎన్నారై కాంగ్రెస్ నేతలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన పొన్నం.. వారికి అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు.
హైదరాబాద్ నుంచి ఉమ్రా యాత్రకు వెళ్లిన యాత్రికులతో వెళ్తున్న బస్సు ఇవాళ తెల్లవారుజాము ఒంటిగంట సమయంలో డీజిల్ ట్యాంకర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 42 మంది సజీవదహనం అయ్యారు. మృతుల్లో 16 మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని సూచించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
సౌదీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మొత్తం 42 మంది మృతి చెందారు. మృతుల్లో హైదరాబాద్ మల్లేపల్లిలోని ఉమ్రా ట్రావెల్స్కు సంబంధించిన 16 మంది యాత్రికులు ఉన్నారు. సీఎం ఆదేశాలతో సహాయక చర్యల కోసం తెలంగాణ సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.కంట్రోల్ రూమ్ నంబర్లు: 79979 59754, 99129 19545
