- ఓపెన్ చేయనున్న సీఎం కేసీఆర్
- పనులను పరిశీలించిన మంత్రి ప్రశాంత్రెడ్డి, డీజీపీ, సీపీ
- సెంటర్లోనే హోం మంత్రి, డీజీపీ, హైదరాబాద్ సీపీ చాంబర్లు
- నిర్వహణకు మరి కొంత టైమ్ పట్టే చాన్స్
- జర్మనీ, బెల్జియం నుంచి డేటా సెంటర్ పరికరాలు రావాలె
హైదరాబాద్, వెలుగు : పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను వచ్చే నెల 4న సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని ఆర్ అండ్ బీ మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. 14వ ఫ్లోర్ నుంచి హైదరాబాద్ నగరాన్ని సందర్శకులు వీక్షించే విధంగా తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. సెంటర్ పనులను గురువారం ఆయన డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ సీవీ ఆనంద్ తో కలిసి పరిశీలించారు. మెయిన్ ఎంట్రెన్స్, పోర్టీకో, గ్రాండ్ ఎంట్రీ, మ్యూజియం, ఆడిటోరియం, ఫ్లోర్ల పనులను చూశారు. మిగిలిన ఫినిషింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను, వర్క్ ఏజెన్సీని ఆదేశించారు. ప్రారంభం అనంతరం సీఎం కేసీఆర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిశీలించనున్నందున దానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో మంత్రి చర్చించారు. కాగా, గత 4 రోజుల నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు వేగంగా జరుగుతున్నాయి. సీపీ సీవీ ఆనంద్ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వందల మంది కార్మికులతో ఎంట్రెన్స్ దగ్గర ఉన్న రోడ్డు మీద చెట్లు తొలగించి కంపౌండ్ వాల్ చుట్టూ వెదురు చెట్లు నాటుతున్నారు. మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర డివైడర్లు, గేట్ దగ్గర పెండింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. అన్ని పనులు వచ్చే నెల 2 సాయంత్రం కల్లా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు.
డేటా సెంటర్ పరికరాలకు నిధులు కావాలె
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కావాల్సిన డేటా సెంటర్ పరికరాలు జర్మనీ, బెల్జియం నుంచి రావాల్సి ఉందని ఆర్ అండ్ బీ అధికారులు చెప్తున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ. 45 కోట్లు విడుదల చేయాల్సి ఉందని అంటున్నారు. బిల్డింగ్ పనులు పూర్తయినప్పటికీ డేటా సెంటర్ పరికరాలు రానందున కమాండ్ కంట్రోల్ సెంటర్పూర్తి స్థాయిలో నిర్వహణలోకి రావడానికి మరి కొంత టైమ్ పట్టనుంది. సిటీలోని అన్ని సీసీ కెమెరాలను ఈ కేంద్రం నుంచి పోలీస్ అధికారులు పర్యవేక్షించనున్నారు. ఇందుకు ఓ ఫ్లోర్లో భారీ ఎల్ఈడీ స్ర్కీన్ ను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కేంద్రాల్లో ఎస్పీల దగ్గర ఉండే సీసీ టీవీ ఫుటేజ్ ను ఈ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేస్తారని సమాచారం. ఇందుకు డేటా సెంటర్ కీలకం కానుంది. ప్రస్తుతానికి కమాండ్ కంట్రోల్ సెంటర్లో రాష్ట్ర హోం మంత్రి , డీజీపీ మహేందర్ రెడ్డి తో పాటు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ చాంబర్లు రెడీ అయ్యాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పూర్తి స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే ఆపరేట్ అవుతుందని పోలీస్ అధికారులు చెప్తున్నారు. బషీర్ బాగ్ లోని హైదరాబాద్ సీపీ ఆఫీస్ ను ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ కు అప్పగించనున్నట్లు తెలుస్తున్నది.
ఏడేండ్ల నుంచి పనులు
రూ.585 కోట్ల వ్యయంతో హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రభుత్వం నిర్మిస్తున్నది. షాపూర్ జీ పల్లోంజి కంపెనీ కాంట్రాక్ట్ దక్కించుకొని పనులు చేపడుతున్నది. 2015 లో కమాండ్ కంట్రోల్ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయగా.. ఏడేండ్లుగా పనులు సాగుతున్నాయి. కరోనాతో రెండేండ్లు పనులు ఆగిపోగా.. ప్రభుత్వం బిల్లులు విడుదల చేయకపోవటంతో మరికొంత కాలం పనులు నిలిచిపోయాయి.