ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు: ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న కలెక్టరేట్​ భవన నిర్మాణ పనులను స్పీడప్​ చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా కలెక్టర్​ వీపీ గౌతమ్​తో కలిసి భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగితెలుసుకున్నారు. అన్ని గదులు ఫ్లోరింగ్​ అయ్యాయని, కరెంట్​పనులు కొనసాగుతున్నాయని అధికారులు మంత్రికి తెలిపారు. కరెంట్​కు అంతరాయం లేకుండా జనరేటర్​తో పాటు ప్రత్యామ్నాయ లైన్​ ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. మంత్రి వెంట అదనపు కలెక్టర్​ స్నేహలత మొగిలి, ఆర్అండ్​బీ ఎస్ఈ లక్ష్మణ్​, ఈఈ శ్యాంప్రసాద్​, విద్యుత్ ఆఫీసర్లు ఉన్నారు.

జీఎం ఆఫీస్ ​ఏర్పాటుతో సత్తుపల్లికి మహర్దశ:ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
సత్తుపల్లి, వెలుగు: సత్తుపల్లిలో సింగరేణి జనరల్ మేనేజర్ ఆఫీస్​ఏర్పాటుతో మహర్దశ పట్టనుందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఆదివారం కిష్టారం పరిధిలో జీఎం ఆఫీస్​నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సండ్ర మాట్లాడుతూ లాభాల్లో వాటా ఇచ్చే ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి అన్నారు. జీఎం ఆఫీస్ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. అధునాతన సౌకర్యాలతో కూడిన హాస్పిటల్, రిక్రియేషన్ క్లబ్బులు, స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటవుతాయన్నారు. దీంతో సింగరేణి కార్మికులతో పాటు ఈ ప్రాంత ప్రజల అవసరాలకు ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపుడి మహేష్, కిష్టారం సర్పంచ్ రేణుక, సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్ రావు, జీఎం జక్కం రమేశ్, జీఎం(సివిల్) సూర్యనారాయణ, రఘురామి రెడ్డి, రమణ రెడ్డి, పీవోలు వెంకటాచారి, నరసింహారావు, ఎంపీటీసీ సునీత, అధికారులు పాల్గొన్నారు. 

డిజిటలైజేషన్​తో విప్లవాత్మక మార్పు: బీజెపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ
ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు: డిజిటలైజేషన్​తో బ్యాంకింగ్​ రంగంలో విప్లవాత్మక మార్పులు జరుగుతాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ అన్నారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా 75 బ్యాంకులను డిజిటలైజేషన్​ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం మమతా రోడ్డులోని సిటీ యూనియన్ బ్యాంకు డిజిటలైజేషన్​కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా గల్లా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం జన్ ధన్​​యోజనతో సుమారు 40కోట్ల మందికి జీరో బ్యాలెన్స్​ అకౌంట్లను అందించిందన్నారు. డిజిటలైజేషన్​ ద్వారా పేపర్ లెస్​సేవలు పొందే అవకాశం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో సిటీ యూనియన్​ బ్యాంక్​ రీజినల్​ మేనేజర్​ విజయకుమార్​, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్ర ప్రదీప్​, నున్నా రవికుమార్​, విజయరాజు, ఎల్లారావు గౌడ్​, రవి రాథోడ్​పాల్గొన్నారు.

ప్రశాంతంగా గ్రూప్ 1 ఎగ్జామ్
ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో 58 సెంటర్లలో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. 17,366 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాయాల్సి ఉండగా,13,428 మంది ఎగ్జామ్ రాశారు. సుమారు 3,938 మంది గైర్హాజరయ్యారు. ఖమ్మంలోని ఎస్ ఆర్అండ్ బీజీఎన్ ఆర్ సెంటర్ లో మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన ప్రశాంత్, ఇల్లందుకు చెందిన మౌనిక, కోదాడకు చెందిన చెన్నయ్య లేటుగా రావడంతో ఎగ్జామ్​కు అనుమతించలేదు. కలెక్టర్ వీపీ గౌతమ్ ఖమ్మం సిటీలోని ఉమెన్స్ కాలేజ్, ఆర్జేసీ పీజీ కాలేజ్ సెంటర్లను విజిట్ చేశారు. 

కొంపముంచిన నిమిషం నిబంధన
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఒక్క నిమిషం నిబంధన అభ్యర్థుల కొంపముంచింది. జిల్లావ్యాప్తంగా లేటుగా వచ్చిన 25 మందికి పైగా అభ్యర్థులు ఎగ్జామ్​ రాయకుండా వెనుదిరిగారు.  23 సెంటర్లలో 8,851 మంది అటెండ్​ కావాల్సి ఉండగా 6,611 మందే అటెండ్​ అయ్యారు. 2,240 మంది ఆబ్సెంట్​ అయ్యారు. ఖమ్మం నుంచి ఎగ్జామ్​ పేపర్లు ఉదయం 9.40 గంటలకు రావడంతో హడావుడిగా పంపిణీ చేశారు. ఎగ్జామ్​ సెంటర్లను కలెక్టర్​అనుదీప్, ఎస్పీ  డాక్టర్​ వినీత్​ తనిఖీ చేశారు. ఎగ్జామ్​ విధులు నిర్వహిస్తున్న అన్నపురెడ్డిపల్లి నాయబ్​ తహసీల్దార్​ రామ్​నరేశ్​తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అక్కడే ఉన్న కలెక్టర్​ అనుదీప్​ తన వాహనంలో ఆయనను హాస్పిటల్​కు తరలించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పాల్వంచలోని అనుబోస్​ కాలేజీ సెంటర్​వద్ద అభ్యర్థులకు విషెష్​ చెప్పారు. 

నేటి నుంచి జోనల్​ స్థాయి గేమ్స్
భద్రాచలం, వెలుగు: 2022–-23 సంవత్సరానికి ట్రైబల్ జోనల్​ లెవల్​ గేమ్స్ మూడు రోజుల పాటు భద్రాచలంలోని గిరిజన గురుకుల కాలేజీలో జరగనున్నాయి.  17,18,19 తేదీల్లో జరిగే పోటీలకు గ్రౌండ్​ను రెడీ చేశారు. నల్గొండ, ఖమ్మం ,భద్రాద్రికొత్తగూడెం  జిల్లాల్లోని వివిధ ట్రైబల్​ కాలేజీల్లో చదివే బాలికలు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. దేవరకొండ, మిర్యాలగూడ, దామరచెర్ల, కొండమల్లేపల్లి, చింవేల, తుంగతుర్తి, మణుగూరు, సుదిమళ్ల, అన్నపురెడ్డిపల్లి, కొత్తగూడెం, భద్రాచలం ,వైరా, అంకంపాలెం తదితర గిరిజన గురుకుల స్కూళ్లు, కాలేజీల నుంచి 600 మంది బాలికలు విలువిద్య, క్యారమ్స్, కబడ్డీ, వాలీబాల్​, ఖోఖో, టెన్నికాయిట్, హాకీ, రెజ్లింగ్​, బ్యాడ్మింటన్​​, బాక్సింగ్​, హ్యాండ్​ బాల్​ తదితర 13 గేమ్స్​ తో పాటు అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారు. క్రీడాకారులకు, పీఈటీలకు, ఉపాధ్యాయులకు వసతి, భోజన సదుపాయాలు కల్పించినట్లు ఏపీవో జనరల్​ డేవిడ్​రాజ్ పేర్కొన్నారు.

ఎస్సీ జర్నలిస్టులకు దళితబంధు ఇవ్వాలి

ఖమ్మం టౌన్, వెలుగు: రాష్ట్రంలో ఎస్సీ జర్నలిస్టులకు దళితబంధు వర్తింపజేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్​(టీజేఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఖమ్మం ఆర్అండ్ బీ గెస్ట్​హౌజ్​లో టీయూడబ్ల్యూజే యూనియన్​ మీటింగ్​జరిగింది. ఈ సందర్భంగా దళిత జర్నలిస్టుల జిల్లా సమన్వయ కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్ గా అమరవరపు కోటేశ్వరరావు, కో కన్వీనర్లు గా మందటి వెంకటరమణ, గుద్దేటి రమేశ్​బాబు,  సభ్యులుగా రాంబాబు, నాగేశ్వరావు, వేణుగోపాల్, కుమార్ లను ఎన్నుకున్నారు. 

మిత్రుని కుటుంబాన్ని ఆదుకున్న క్లాస్​మేట్స్

రూ.లక్షా 75వేలు ఫిక్స్​డ్​ డిపాజిట్​ బాండ్​ ​అందజేత
ఖమ్మం రూరల్​, వెలుగు : అనారోగ్యంతో చనిపోయిన మిత్రుని కుటుంబానికి ఆర్థికసాయం చేసి అండగా నిలిచారు క్లాస్​మేట్స్. ఖమ్మం రూరల్​ మండలం తెల్దారుపల్లికి చెందిన మల్లెబోయిన ఉపేందర్​ హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ కాలేజీలో ఉద్యోగం చేస్తూ ఇటీవల చనిపోయాడు. ఉపేందర్​ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకున్న అతడి క్లాస్​మేట్స్​అందరూ  కలిసి రూ.1లక్షా75వేలు సేకరించి అతని కొడుకు పేరుమీద బ్యాంకులో ఫిక్స్​డ్​డిపాజిట్​చేశారు. ఆ బాండ్​ను ఆదివారం భార్య శైలజకు అందజేశారు. వీరంతా గుర్రాలపాడు గ్రామంలోని అనిబిసెంట్ కాలేజీలో 2004-–07లో ఎంసీఏ చదువుకున్నారు. 

ప్రజల ఆకలి తీర్చడంలో మోడీ ఫెయిల్​:సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
ఖమ్మం టౌన్, వెలుగు: మోడీ సర్కారు దేశంలోని ప్రజల ఆకలి తీర్చటంలో ఫెయిల్​అయిందని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు విమర్శించారు. ఇందుకు ప్రపంచ ఆకలి సూచీలో భారత్ ర్యాంకు దిగజారడమే నిదర్శనమని అన్నారు. ఆదివారం ఖమ్మం సుందరయ్య భవన్ లో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు యర్రా శ్రీకాంత్ అధ్యతన జరిగిన నియోజకవర్గ బాధ్యుల సమావేశంలో నున్నా నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆకలి సూచీలో భారత్​నానాటికీ పడిపోతోందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.విక్రం, వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసరావు , విష్ణు వర్ధన్, పి.రమ్య, సుదర్శన్, లింగయ్య పాల్గొన్నారు.