తిరుపతి: ఏపీ మంత్రి ఆర్కే రోజా టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు కరోనా కష్ట కాలంలో పక్క రాష్ట్రంలో దాక్కున్నారు.. ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు ఏపీలో పాద యాత్ర చేస్తారని ప్రశ్నించారు.యువ గళమా, నారా గళమా అంటూ ఎద్దేవా చేశారు. ‘‘ ఏ రోజు ఏ షోకు వెళ్లని పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ షో కు వెళ్ళారు. చంద్రబాబు వెళ్లొచ్చిన తర్వాత.. ప్యాకేజీ తీసుకొని పవన్ కళ్యాణ్ ఆ షోకు వెళ్ళారు. పచ్చి బూతులు తిట్టిన బాలకృష్ణ షో కు పవన్ వెళ్లారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కోసం ఎంతటికైనా దిగజారుతారు. పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలతో బీజేపీ జెండా, టీడీపీ జెండా మోయిస్తున్నారు’’ అని రోజా వ్యాఖ్యానించారు.
13వ నేషనల్ డ్యాన్స్ స్పోర్ట్స్ చాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించిన సందర్భంగా మంత్రి రోజా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘టీడీపీ హయాంలో 30 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే.. వైసీపీ అధికారం లోకి వచ్చిన తర్వాత 62 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయి’’ అని రోజా గుర్తు చేశారు. మరో రెండున్నర లక్షలు మందికి అదనంగా జనవరి నెలలో పెన్షన్లు ఇవ్వబోతున్నట్లు ఆమె వివరించారు.