రైతు బంధు, రైతు భీమా పథకాలతో.. రైతులను రాజులుగా చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం రాచులూర్, గుమ్మడవెళ్లి, మీర్ ఖాన్ పెట్ గ్రామాల్లో రైతు అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం సూచించిన పంటలే వేయాలన్నారు. రైతులు గిట్టుబాటు ధర వచ్చే విధంగా పంటలు వేసుకోవాలన్నారు. మొక్కజొన్న పంటను వేసుకోవొద్దని తెలిపారు.
కందులు, పత్తి, రాగులు, జొన్నలు, కొర్రలు, వంటి లాభదాయకంగా ఉండే పంటలు వేసి, రైతులు లాభాల బాటలో నడవాలన్నారు. ఆర్గానిక్ పంటల సాగు లాభసాటిగా ఉంటాయని తెలిపారు. మొక్కజొన్న పంట మాత్రం వేసుకోవొద్దని ఒక వేళ వేసుకున్నా ప్రభుత్వ వాటిని కొనలేదని చెప్పారు. సదస్సులో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా జడ్పీచైర్ పర్సన్ అనితా హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు బిడ్డ గా రైతు కష్టాలు తనకు తెలుసని, ముఖ్యమంత్రి చెప్పిన విధంగా పంటలు వేసుకొని లాభాలు సాధించాలని రైతులను కోరారు.