
లోకల్ బాడీ ఎన్నికలపై మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు. వారం రోజుల్లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. మహబూబాబాద్ పర్యటనలో ఉన్న సీతక్క ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. రెండు మూడు రోజుల్లో రైతులకు రైతు భరోసా డబ్బులిస్తామని చెప్పారు. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు. నోటిఫికేషన్ వచ్చిన నెలరోజుల లోపే ఎన్నికలను పూర్తి చేసేలా ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం.
గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు గతేడాది ఫిబ్రవరిలోనే ముగియగా దాదాపు ఏడాదిన్నరగా ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,600 కోట్లకు పైగా ఆగిపోయాయి. పాలకవర్గాలు ఎన్నికైతేనే ఈ నిధులు వస్తాయి. ఇక మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాల గడువు గతేడాది జులై మొదటి వారంలో.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల గడువు ఏప్రిల్ లోనే ముగిశాయి.
ALSO READ | ఫార్ములా ఈ కార్ రేస్ కేస్: కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు
ముఖ్యంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ లాంటి పదవులు దక్కితే పార్టీ మరింత బలపడుతుందని కాంగ్రె స్ పెద్దలు భావిస్తున్నారు. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో.. జులైలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.
వాస్తవానికి పంచాయతీ ఎన్నికలను గతేడాదే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ, అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. ఇందుకోసం సమగ్ర కుల గణన సర్వే చేపట్టింది. అనంతరం బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, ఆమోదించింది.