
సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి బోనాల పండగ ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు జరుపుకునే పవిత్రమైన రోజున అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో వందల ఏళ్లుగా బోనాల ఉత్సవాలు జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఎవరు ఏ రంగంలో ఉన్నా.. ఎంత స్థాయిలో ఉన్నా దేవతలను పూజించే విధానాలు మాత్రం ఒకేలా ఉంటాయని అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందామని అన్నారు. ఆలయంలో సేవలందిస్తోన్న దక్కన్ మానవ సేవ సమితి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భక్తుల సౌకర్యాల్లో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలకు బోనాల పండగ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సీతక్క.