
షాద్నగర్, వెలుగు : దేశంలో శాంతి, సామరస్యాన్ని కాపాడుతూ దేశ రక్షణ కోసం సైన్యం తీసుకునే ఏ చర్యకైనా కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని నందిగామ, కొత్తూరు ఉమ్మడి మండలాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఎంతో సాహసోపేతమైందన్నారు.
కోట్లాదిమంది భారతీయులు సైన్యం వెంట ఉన్నారన్నారు. దేశంలో రాజకీయాలు, సిద్ధాంతాల పరంగా వేరు అయినప్పటికీ దేశ సమగ్రత, శాంతిని కాపాడడంలో కలిసి పనిచేయాలని చెప్పారు. షాద్నగర్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతోందని, నియోజకవర్గానికి ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, హరినాథ్రెడ్డి పాల్గొన్నారు.