కాటారం, వెలుగు: రాహుల్గాంధీని ప్రధానిని చేద్దామని ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్బాబు కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. పెద్దపల్లిలో పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించుకుందామన్నారు. ఇందుకోసం ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త కష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం మంత్రి సొంత గ్రామమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీలను అమల్లోకి తీసుకువస్తున్నామని వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయ్యిందని, గవర్నమెంట్ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి గవర్నమెంట్ఎంప్లాయీస్కు ఫస్ట్ తారీఖునే జీతాలు పడేలా కృషి చేశామని చెప్పారు.
అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారతకు కట్టుబడి ఉందని.. మహిళలను కోటీశ్వరులని చేస్తామని మంత్రి చెప్పారు. ఎన్నికల కోడ్ అయిపోగానే అన్ని హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. మంథని నియోజకవర్గానికి తాగు, సాగు నీరు అందించేందుకు రూపకల్పన చేసిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ను గత బీఆర్ఎస్ప్రభుత్వం విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పనులు స్టార్ట్ చేయించానని చెప్పారు. కాటారం మండలంలో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల్గించకుండా న్యాయపరమైన సమస్యలు తీర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాటారం ఎంపీపీ పంతకాని సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్రెడ్డి, నాయకులు కోట రాజబాపు, చీమల సందీప్, కార్యకర్తలు పాల్గొన్నారు.