
- హైదరాబాద్లో 100 మీటర్లకన్నా ఎత్తున్న బిల్డింగులు 200కుపైనే
- మరో 250 వరకు నిర్మాణ దశలో ఉన్నాయని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, కాలుష్యం తదితర ఎన్నో సమస్యలకు పర్యావరణహిత నిర్మాణాలే పరిష్కారమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నదని, ఈ ప్రయాణంలో భాగస్వామ్యం కావాలని సివిల్ ఇంజనీర్లను ఆయన కోరారు. మూడున్నరేండ్లలో 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను అర్హులకు పంపిణీ చేస్తామన్నారు.
శుక్రవారం అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజినీర్స్(హైదరాబాద్) సెంటర్ ఆధ్వర్యంలో రాయదుర్గంలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ‘నెక్స్ట్ - జెన్ హైరైజ్ బిల్డింగ్స్ : అడ్వాన్స్ మెంట్స్ ఇన్ కాంపోజిట్, స్టీల్ స్ట్రక్చర్స్’ అంశంపై సదస్సును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని అన్ని మెట్రో సిటీల్లోనూ హైరైజ్ భవనాల నిర్మాణం పెరుగుతున్నదన్నారు.
హైదరాబాద్లో 100 మీటర్ల కన్నా ఎత్తున్న బిల్డింగులు 200 కన్నా ఎక్కువే ఉన్నాయన్నారు. మరో 250 బిల్డింగులు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. ఇలాంటి సమయంలోనే పర్యావరణహితంగా అడుగులు వేయాల్సి ఉంటుందన్నారు. ఇలాంటి భవనాల్లో ఆర్సీసీ నిర్మాణాలకు బదులుగా కాంపోజిట్, స్టీల్ స్ట్రక్చర్స్కు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ బిల్డింగుల నిర్మాణానికి పట్టే సమయం 40 శాతం, ఖర్చు 30 శాతం వరకు తగ్గుతుందని తెలిపారు. భూకంపాలనూ తట్టుకుంటాయన్నారు. నిర్మాణ సమయంలో వెలువడే కాలుష్యమూ తగ్గుతుందని చెప్పారు.