హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై లైంగిక వేధింపుల ఘటనను తెలంగాణ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. బాలికలపై వేధింపులకు పాల్పడుతున్న అధికారి హరికృష్ణపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మూడు రోజుల్లో విచారణ పూర్తి చేసి జైలుకు పంపిస్తామన్నారు. మహిళలను వేధిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
అంతకుముందు స్పోర్ట్స్ స్కూల్ లో అరాచకాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి వాటికి తావు ఉండకూడదన్నారు. బాలిక పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై తక్షణం చర్యలు చేపట్టాలని, పూర్తి స్థాయి విచారణ జరిపించి, బాధితురాళ్లకు న్యాయం చేయాలని మంత్రి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కోరారు. కవిత ట్వీట్ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెంటనే స్పందించారు. దీనిపై ఉన్నతాధికారులతో విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఒత్తిళ్లకు లోనవ్వదని, అధికారులు, నేతలు ఎవరైనా ఊరుకునేది లేదన్నారు. విద్యార్థుల్లో ధైర్యం నింపేందుకు చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలు వివిధ ఆటల పోటీలకు సంబంధించి కోచింగ్ తీసుకుంటున్నారు. అయితే స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ హరికృష్ణ కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా బాలికలు ఆరోపిస్తున్నారు. సాయంత్రం ఆటవిడుపు పేరుతో బాలికలలో కొంతమందిని బయటకు తీసుకెళుతున్నాడని, అక్కడ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తు్న్నారు. అంతేకాకుండా అర్ధరాత్రి గదుల్లోకి వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు. హరికృష్ణకు ఓ మహిళా ఉద్యోగితో సహా మరో ముగ్గురు అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. సదరు మహిళా ఉద్యోగితో ఓఎస్డీకి అక్రమ సంబంధం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.