
హైదరాబాద్ : గతంలో మద్యం షాప్లో మాఫియా ఉండేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రంలో కోత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు షెడ్యూల్ విడుదలైదని తెలిపారు. నేటి నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించారు. దరఖాస్తుల ధర, లైసెన్స్ ఫీజు పెంచలేదని స్పష్టం చేశారు. ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా పోటీ పడొచ్చు అని తెలిపారు. బ్యాంక్ గ్యారంటీ కూడా తగ్గించామన్నారు. ప్రభుత్వానికి డబ్బు చెల్లించే వాయిదాలు కూడా పెంచామని పేర్కొన్నారు. స్థానికులకే దుకాణాలు దక్కేలా చర్యలు చేపట్టామని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, గౌడ్ లకు సీఎం కేసీఆర్ రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. అప్పట్లో కల్తీ, విదేశీ మద్యం అమ్మేవారని..ఇప్పుడు అలా లేదన్నారు. గుడుంబాను నియంత్రించామన్న ఆయన.. దురదృష్టవశాత్తు పక్క రాష్ట్రాల్లో గంజాయి పండిస్తున్నారని దానిపై నిఘా పెట్టామని మంత్రి పేర్కొన్నారు. గంజాయి వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. విదేశాల నుండి వచ్చే డ్రగ్స్ పై కూడా నిఘా ఉందన్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.