
- కేటీఆర్ లిస్ట్ ఇవ్వలేదు.. అక్కడ అధికారులతో చేయిస్తున్నాం: మంత్రి పొంగులేటి
- ప్రభుత్వ భూములతో ఉన్న గెట్టు పంచాయితీలు పరిష్కరిస్తం
- వారంలో ఫోరెన్సిక్ ఆడిట్ మొదలు.. భూ బకాసురులను బయటపెడ్తం
- పేదలకు అసైన్డ్ పట్టాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నం
- ఏఐ టెక్నాలజీతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోఅవినీతికి చెక్ పెడ్తున్నట్టు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చెప్పినోళ్లకు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. కేటీఆర్ లాంటి వాళ్లు ఇందిరమ్మ ఇండ్ల లిస్ట్ ఇవ్వలేదని, అక్కడ అధికారులతో విచారించి ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ధరల నియంత్రణకు ఒకటి రెండు రోజుల్లో కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు.
జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ అధ్యక్షతన కమిటీ పని చేస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇప్పటి వరకూ 2.10 లక్షల మంది లబ్ధిదారులు ఎంపికైనట్టు వెల్లడించారు. వచ్చే నెల 10వ తేదీలోగా మిగతా లబ్ధిదారుల జాబితా సిద్ధమవుతుందని తెలిపారు. శుక్రవారం సెక్రటేరియెట్లోని తన చాంబర్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. పైలెట్ ప్రాజెక్టులో 42 వేల ఇండ్లు మంజూరు చేయగా.. 24 వేల ఇండ్ల నిర్మాణం ప్రారంభమైందని తెలిపారు. ఇందులో సుమారు 100 ఇండ్లు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. నిర్మాణానికి ఇప్పటి వరకు రూ. 130 కోట్లు చెల్లించామని తెలిపారు. ఐటీడీఏ (సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ) పరిధిలో చెంచులకు 9,200 ఇండ్లు మంజూరు చేశామని వివరించారు. హైదరాబాద్ నగరంలోని 16 స్లమ్స్లో నాలుగంతస్తుల భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లోనూ ఇదే తరహాలో నిర్మిస్తామని తెలిపారు.
ఆ గ్రామాల్లో ఏరియల్ సర్వే చేస్తున్నం
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల గెట్టు పంచాయితీలు తెంచేం దుకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. దేవాదాయ, అటవీ, ఇరిగేషన్ శాఖలతో సమన్వయం చేసుకుంటామని చెప్పారు. సర్వే నంబర్, రికార్డు, భూముల ప్రకారం రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఇక పైలెట్ ప్రాజెక్ట్ కింద భూ రికార్డుల్లో ఒక సర్వే నెంబర్.. ఫీల్డ్లో మరో సర్వే నెంబర్లో కబ్జా మీద ఉంటే ఇరుపక్షాల సమక్షంలో నోటీసులు ఇచ్చి, పంచనామా చేసి మార్పులు చేయనున్నట్టు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వ, లైసెన్స్డ్ సర్వేయర్లు పనిచేస్తారన్నారు. అసలు నక్ష లేని 400కు పైగా గ్రామాలకు సర్వే మ్యాప్లు రెడీ చేస్తున్నామని, ఇందులో రెండు విధానాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఒకటి ఫీల్డ్ లెవెల్లో డిజిటల్ సర్వే కాగా.. మరొకటి ఏరియల్ సర్వే అని తెలిపారు. రెండింటిని పరిశీలించి ఏదీ అక్యురేట్ ఉంటే దానిని భవిష్యత్తులో సర్వే మొత్తానికి వినియోగించనున్నట్టు చెప్పారు. త్వరలోనే భూములపై ఫోరెన్సిక్ అడిట్ కూడా నిర్వహించబోతున్నామని తెలిపారు. వారం రోజుల్లోనే ఏ కంపెనీ ఫోరెన్సిక్ ఆడిట్ చేయబోతున్నదో ఫైనల్ చేయనున్నట్టు చెప్పారు. ఆగస్టులో భూ బకాసురుల లిస్ట్ను బయటపెడుతామని ప్రకటించారు. తొలి విడతలో 3 వేల మంది లైసెన్డ్ సర్వేయర్లను తీసుకొని, శిక్షణ ఇస్తున్నట్టు వివరించారు. రెండో విడతలో మరో 3 వేలమందికి ట్రైనింగ్ఇవ్వనున్నట్టు తెలిపారు. గ్రామాల్లో 3 వేలకు పైగా జీపీవో లు రాబోతున్నారని చెప్పారు. త్వరలో మిగిలిన వారిని కూడా రిక్రూట్ చేసుకుంటామని తెలిపారు.
నిరుపేదలకు అసైన్డ్ పట్టాలు
సాగు చేసుకుంటున్న నిరుపేదలకు అసైన్డ్ భూముల పట్టాలు ఇవ్వనున్నట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. ఎవరైనా పేదలు అసైన్డ్ భూములు కొనుగోలు చేసి ఉంటే వారి పేరు మీదకు మార్చే దానిపై ఆలోచిస్తున్నట్టు తెలిపారు. ధనవంతులు తీసుకుంటే తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పారు. సబ్ రిజిస్ట్రార్ఆఫీసుల్లో ఏఐ టెక్నాలజీ వినియోగించి రిజిస్ట్రేషన్లలో పారదర్శకత ఉండేలా చూస్తామన్నారు. స్లాట్ విధానంతో అవినీతికి చెక్ పెట్టినట్టు వివరించారు.
ఢిల్లీలో బీజేపీకి, బీఆర్ఎస్కు మంచి దోస్తానా
ఢిల్లీలో బీజేపీకి, బీఆర్ఎస్కు మంచి దోస్తానా ఉన్నదని, ఈ విషయం తాను అనడం లేదని.. కవిత, బీజేపీ లీడర్లే అంటున్నారని మంత్రి పొంగులేటి అన్నారు. కవిత ఎపిసోడ్ టీ కప్పులో తుఫాన్ లాంటిదని చెప్పారు. ‘‘వాళ్లంతా కుటుంబ సభ్యులు. ఒకరు ఆడమంటారు. మరొకరు ఆడతారు. ఒకరు దిగమంటారు. ఇంకొకరు దిగుతుంటరు’’ అని అన్నారు. కాంగ్రెస్కు కవిత వస్తే ఏ మంత్రి పదవి ఇస్తారు? ఏ పోర్ట్ ఫోలియో ఇస్తారు? ఏ చాంబర్ ఇస్తారు? అనే విషయాలు చర్చించేంత పెద్ద నాయకుడిని తాను కాదని తెలిపారు. ‘‘కవిత ఒక్కోసా రి ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. దయ్యాలని, దేవుడని, నాన్నంటే గౌరవమని, నాన్నకు తనను దూరం చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఎవరు దూరం చేస్తున్నారో కవిత చెప్తే విందామని నేను కూడా ఎదురు చూస్తున్నా” అని పొంగులేటి అన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్కు ఈడీ అంటే అంత ఉత్సాహం ఎందు కని, వారు తన ఇంటికి ఎందుకు రాలేదో ఈడీని కేటీఆరే అడగాలని చురకలంటించారు. మిగిలిన మూడేండ్లు సీఎంగా రేవంత్ రెడ్డే ఉంటారని, ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీలో అవినీతి జరిగింది ప్రొజెక్షన్ అవుతుందా? లేదా? జైళ్లోకి వెళ్తారా? అనేది త్వరలోనే తెలుస్తుందని మంత్రి తెలిపారు. మేడిగడ్డ విషయంలో ఎల్అండ్ టీ అసలు ముద్దాయి అని, కేసీఆర్ సీఎంగా ఉన్న టైంలోనే కూలిందని అక్కడి ఇంజినీరు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. అదృ ష్టవశాత్తు వారి హయాంలోనే మేడిగడ్డ కూలిందని, లేదంటే ఆ నెపం తమపైనే నెట్టివేసేటోళ్లని అన్నారు.
కవిత ఒక్కోసారి ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. దయ్యాలని, దేవుడని, నాన్నంటే గౌరవమని అంటున్నారు. నాన్నకు తనను దూరం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఎవరు దూరం చేస్తున్నారో కవిత చెప్తే విందామని నేను కూడా ఎదురుచూస్తున్నా.
మంత్రి పొంగులేటి