రాష్ట్రంలో నీటి వనరులున్న ప్రతి చోట చేపపిల్లలు వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మాసబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మొబైల్ ఫిష్ ఔట్ లెట్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడం, అక్కడి ప్రజల జీవితాలలో వెలుగులు నిపాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు
గత ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమాన్ని విస్మరించాయని… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో మరెక్కడా లేని విధంగా మత్స్యకారుల అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నదని అన్నారు. చేపలు విక్రయించుకోవడానికి సబ్సిడీపై వాహనాలు, వృత్తికి అవసరమైన వలలు, కేట్స్ తదితర పరికరాలను మత్స్యాకారులకు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు.
నేషనల్ ఫిషరీస్ డెవలప్ మెంట్ బోర్డ్, తెలంగాణ మత్స్య శాఖల ఆధ్వర్యంలో చేపలు, చేపల వంటకాలు విక్రయించు కోవడానికి సబ్సిడీ పై వాహనాలు ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు. జిహెచ్ఎమ్సీ పరిధిలోని 150 డివిజన్ లలో మొబైల్ ఫిష్ ఔట్ లెట్స్ ద్వారా ప్రజల వద్దకే వెళ్లి పరిశుభ్రమైన చేపలు విక్రయించడం, ఉపాధి అవకాశాలు కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశమని ఆయన చెప్పారు.