వేణుమాధవ్ హాస్పిటల్ బిల్లు కట్టిన మంత్రి తలసాని

వేణుమాధవ్ హాస్పిటల్ బిల్లు కట్టిన మంత్రి తలసాని

టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ కు కన్నీటి నివాళి అర్పించారు అభిమానులు. ఇవాళ ఉదయం ఫిలింనగర్ లోని ఫిలించాంబర్ లో వేణుమాధవ్ భౌతిక కాయానికి ప్రముఖులు నివాళులు అర్పించారు. వేణుమాధవ్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని, అతడి మంచితనాన్ని గుర్తుచేశారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీవిత, రాజశేఖర్, ఉత్తేజ్, ఆలీ సహా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రముఖులు వేణుమాధవ్ కు కడసారి నివాళులు అర్పించారు. హాస్పిటల్ నుంచి వేణుమాధవ్ ను డిశ్చార్జ్ చేసే సమయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంతో సాయం చేశారని జీవిత చెప్పారు.

“ఇక్కడో విషయం అందరికీ తెలియాలి. ఇన్సూరెన్సులు, మెడిక్లెయిమ్ లతో వేణుమాధవ్ కు కొన్నిరోజులుగా హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ జరిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరఫున మేం అన్నీ ఫాలో అప్ చేశాం. ఐతే.. నిన్న డిశ్చార్జ్ చేసే టైమ్ లో చివరగా రూ.3లక్షల బిల్లును హాస్పిటల్ యాజమాన్యం చూపించారు. మేం అందరం హాస్పిటల్ మేనేజ్ మెంట్ తో మాట్లాడి దానిని రూ.2లక్షలకు తగ్గించాం. అదే సమయంలో మంత్రి తలసాని హాస్పిటల్ కు వచ్చి వివరాలు తెల్సుకున్నారు. వెంటనే ఆ రూ.2లక్షలను మంత్రి తలసాని చెల్లించారు. మంత్రి తలసానికి మా అందరితరఫున ధన్యవాదాలు. ” అని జీవిత చెప్పారు.