హైదరాబాద్: ఈ ఏడాది ఆగస్టు 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రారంభిస్తున్నట్టు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక భవన్ లో పశసంవర్ధక, మత్స్య,పాడి పరిశ్రమ శాఖలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ పంపిణీలో హాజరయ్యే ప్రజా ప్రతినిధులు కోవిడ్ /19 నిబంధనలు పాటించాలని అన్నారు. ప్రతి పంపిణీ కార్యక్రమంలో 20, 25 మంది కంటే ఎక్కువగా ఉండడానికి వీల్లేదని చెప్పారు.
గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం చేయాలనీ సీఎం ఈ చేపల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకొచ్చారన్నారు. హైదరాబాద్ లో ఫిష్ అవుట్ లెట్ లు ఏర్పాటు చేయనున్నామని, హైదరాబాద్ లో చేపల అవుట్ లెట్స్ సక్సెస్ అయితే.. అన్ని జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. త్వరలోనే మళ్లీ గొర్రెల పంపిణి మొదలు పెడతామని, ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు ప్రక్రియ చేపడుతున్నట్టు మంత్రి తెలిపారు. జీవులపై ఆధారపడే రైతులు.. అధికారులకు వాటి ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని అన్నారు. భవిష్యత్ లో మరిన్ని ప్లాన్స్ వున్నాయని, ఫిష్ అవుట్ లెట్స్ తో మటన్ అవుట్ లెట్స్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు.
విజయ డైరీ ఉత్పత్తులకు మంచి స్పందన వస్తుందని, దాన్ని మెగా డైరీ గా మార్చే పనులు వేగంగా జరిగుతున్నాయని చెప్పారు మంత్రి. విజయ్ వాటర్ బాటిల్స్ కూడా తయారవుతున్నాయని చెప్పారు. కొందరు నాయకులు విజయ డైరీని నిర్వీర్యం చేయాలనీ చూశారని, కాని ఇప్పుడు డెయిరీ విజయవంతంగా నడుస్తుందని పేర్కొన్నారు.