హైదరాబాద్, వెలుగు : కృష్ణా నీళ్లను ఏపీ దోచుకుపోతుంటే గోదావరి నీళ్లు తీసుకుపోవాలని తాము చెప్పామని బీఆర్ఎస్నేతలు అంటారేంటని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. సోమవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏపీ తమ భూభాగంలో ఫ్లడ్ లైట్లు పెట్టి 24 గంటలు రాయలసీమ ఎత్తిపోతల పనులు చేసుకుంటోందని, మనం ఎన్జీటీకి వెళ్లి స్టేలు తెచ్చినా వాళ్లను ఆపలేకపోయామన్నారు. గోదావరి నుంచి 2 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయన్నది నిజమేనని.. ఇద్దరు సీఎంల మీటింగ్తర్వాతనే రాయలసీమ ఎత్తిపోతలకు టెండర్లు పిలిచి పనుల్లో వేగం పెంచారని అన్నారు.
పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల్లోనే మన వాటా 45 టీఎంసీలే సాధించుకోలేకపోయామన్నారు. అలాంటప్పుడు వాళ్లను గోదావరి జలాలు తీసుకోవాలని అన్నామని హరీశ్రావు చెప్పడం అర్థరహితమన్నారు. గోదావరి నీళ్లు శ్రీశైలానికి వచ్చేది ఎప్పుడు.. రాయలసీమకు పోయేది ఎప్పుడో చెప్పాలని నిలదీశారు.
అది వృథా ఖర్చు కాదు : కడియం శ్రీహరి
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.27 వేల కోట్లు ఇచ్చినా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అంటున్నారని, ఆ వ్యాఖ్యలు సరికావని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ట్రిబ్యునల్వేసినప్పుడు పూర్తయిన ప్రాజెక్టులతో పాటు ఆన్గోయింగ్ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయిస్తుందని తెలిపారు. సభలో ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను మన కౌంటర్పార్టీగా ఉన్న ఏపీ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఆ రెండు రోజులు సభ వద్దు : మల్లారెడ్డి
వసంత పంచమి సందర్భంగా 14, 15 తేదీల్లో 26 వేల పెండ్లిలు ఉన్నాయని.. ఆ రెండు రోజులు సభ పెట్టొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పీకర్ను కోరారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై సభలో సీరియస్గా డిస్కషన్సాగుతున్న సమయంలో మల్లారెడ్డి ఇలాంటి విజ్ఞప్తి చేయడంతో సభలో నవ్వులు పూశాయి.