
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: మహిళాశక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ)కు అందించే చీరల తయారీని స్పీడప్చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన ఆర్డర్ల ప్రకారం నేతన్నలకు నిరంతర పని కల్పించాలని సూచించారు. శనివారం సెక్రటేరియెట్లో చేనేత జౌళిశాఖ పథకాల అమలుపై అధికారులతో తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేపట్టనున్న కార్యక్రమాల ఏర్పాట్లను పటిష్ఠంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ చేనేత రంగానికి దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు ఉందని మంత్రి తెలిపారు. గద్వాల, నారాయణపేట, పోచంపల్లి ఇక్కత్, సిద్దిపేట గొల్లభామ, ఆర్మూర్ పితాంబరీ, మహదేవ్పూర్ టస్సర్ పట్టు చీరలు వంటి ఉత్పత్తులు నేటి యువతలోనూ ఆదరణ పొందుతున్నాయని పేర్కొన్నారు.