రైతుల సంక్షేమమే ధ్యేయం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 

రైతుల సంక్షేమమే ధ్యేయం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 
  • ఎత్తి పోతల పథకాల పనులు వేగవంతం చేయాలి 
  • నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
  • మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 

మేళ్లచెరువు/పాలకీడు/హుజూర్ నగర్/కోదాడ, వెలుగు : రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్​ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. తొలుత పాలకీడు మండలం జాన్ పహాడ్ గ్రామంలో కృష్ణా నదిపై నిర్మిస్తున్న జవహర్ జాన్ పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్, బెట్టేతండా గ్రామంలో మూసీపై నిర్మిస్తున్న పనులను ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో కలిసి మంత్రి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జవహర్ జాన్ పహాడ్ లిఫ్ట్​ ఇరిగేషన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఇప్పటికే మూడుసార్లు సందర్శించినా పనుల్లో ఎలాంటి పురోగతి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు జానపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను రూ.302 కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు.

ఈ ప్రాజెక్టు ద్వారా అలింగాపురం, రాఘవపురం, బొత్తలపాలెం, కోమటికుంట, మీగడంపాడు తండా, చెరువు తండా, హనుమాయగూడెం, పాలకీడు, సజ్జాపురం, నాగిరెడ్డి గూడెం గ్రామాల్లోని 10 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని వెల్లడించారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, పైప్ లైన్ పనులు ఒకేసారి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మూసీలో నీరు నిల్వ ఉండేలా రూ.10.50 కోట్లతో  చెక్ డ్యామ్ నిర్మిస్తున్నామని, ఈ పనులు సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. 

అక్టోబర్ నాటికి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తిచేయాలి..

అక్టోబర్ నాటికి రెడ్లకుంట ఎత్తిపోతల పథకం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులకు సూచించారు. హుజుర్​నగర్ లో రూ.7.25 కోట్లతో  నూతన జూనియర్ కాలేజీ, రూ. 4.65 కోట్లతో డిగ్రీ కాలేజీ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని వర్గాల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించడానికి జూనియర్, డిగ్రీ కళాశాలలను మంజూరు చేశామన్నారు.

ప్రపంచంలో విద్య కంటే గొప్ప విషయం మరొకటి లేదన్నారు. తను కళాశాలలో చదువుకోలేదని, కళాశాల జీవితం అనుభవించాలనే కోరిక ఉండేదన్నారు.16 ఏండ్లకే మిలటరీలో చేరి  గ్రాడ్యుయేషన్​ పూర్తి చేశానని తెలిపారు. యుద్ధ విమానాల పైలెట్ శిక్షణ తీసుకొని చైనా, పాకిస్తాన్ బోర్డర్ లో పనిచేసి మిగ్ 21, 23 యుద్ధ విమానాలు నడిపానని నాటి జ్ఞాపకాలను మంత్రి గుర్తుచేసుకున్నారు. 

రైతులకు న్యాయం చేయాలి..

పరిహారం విషయంలో మానవతాధృక్పథంతో ఆలోచించి రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్ కు మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి సూచించారు. చింతలపాలెం మండలం పాత వెల్లటూరు వద్ద నిర్మాణంలో ఉన్న ఎంబీసీ లిఫ్ట్ పనులను ఆయన పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. పంప్ హౌజ్ నిర్మాణం, రైతుల నుంచి భూసేకరణ ఎందుకు ఆలస్యమైందని అధికారులను ప్రశ్నించారు. ప్రాజెక్టు ఆలస్యంపై సెంట్రల్ ఇరిగేషన్ డిజైనింగ్ ఆఫీసర్ఎం ఎస్ ఎన్ రెడ్డి తో మాట్లాడారు. 45 మీటర్ల లోతు తర్వాత లైమ్ స్టోన్ వచ్చే అవకాశం ఉందని సీసీడీవో మంత్రికి వివరించారు.

వచ్చే నెల 10 నాటికి ప్రాజెక్టు డిజైన్ వస్తుందని మంత్రి తెలిపారు. సాంకేతిక కారణాలను చూపి ఆలస్యం చేయొద్దని, ఇప్పటికే ఎంబీసీపై చాలాసార్లు రివ్యూ నిర్వహించామన్నారు. 191 ఎకరాల భూసేకరణతో 53 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగడం గొప్ప విషయమని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఇది శాశ్వత ఈ పథకంగా నిలిచిపోతుందని వెల్లడించారు. అనంతరం కోదాడ మండలం రెడ్లకుంట గ్రామంలో నిర్మించే రెడ్లకుంట ఎత్తిపోతల పథకం పనులను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డితో కలిసి పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులని మంత్రి ఆదేశించారు.