వృథాగా పోతున్న కృష్ణా నీటిని ఒడిసిపట్టుకోవాలి ; మంత్రి వాకిటి శ్రీహరి

వృథాగా పోతున్న కృష్ణా నీటిని ఒడిసిపట్టుకోవాలి ; మంత్రి వాకిటి శ్రీహరి
  • నారాయణపేట జిల్లా కొల్పూర్‌‌ వద్ద రూ. 700 కోట్లతో రోడ్‌‌ కం బ్యారేజీ నిర్మాణం
  • మంత్రి వాకిటి శ్రీహరి

మ‌‌క్తల్, వెలుగు : కృష్ణా జ‌‌లాలు దిగువకు వృథాగా పోకుండా ఒడిసి ప‌‌ట్టుకోవాల్సిన బాధ్యత తెలంగాణ‌‌, క‌‌ర్నాటక ప్రభుత్వాలపై ఉంద‌‌ని మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. నారాయణపేట జిల్లా మాగనూర్‌‌ మండలం కోల్పూర్‌‌ వద్ద రూ.700 కోట్లతో రోడ్‌‌ కం బ్యారేజీ నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆదివారం కర్నాటకలోని రాయచూరులో ఆ రాష్ట్ర ప్రజా ప్రతినిధులు, నీటి పారుదల శాఖ ఆఫీసర్లతో మంత్రి వాకిటి శ్రీహరి సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కర్నాటక, తెలంగాణ భాగస్వామ్య నిధులతో కొల్పూర్‌‌ వద్ద మినీ జూరాల ప్రాజెక్ట్‌‌ నిర్మాణం చేపట్టామన్నారు. కృష్ణా నదికి వరదలు వచ్చిన టైంలో వందల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి పోతోందని, ఈ నీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కృష్ణా జలాలను కాపాడుకోగలిగితే మక్తల్‌‌ నియోజకవర్గంతో పాటు పేట, కొడంగల్‌‌ నియోజకవర్గాల్లో సాగు, తాగునీటి అవసరాలు తీర్చవచ్చన్నారు.

ఈ మినీ ప్రాజెక్ట్‌‌ వల్ల నారాయణపేట జిల్లాలోని మొత్తం భూములకు సాగు నీరు అందడంతో పాటు తాగునీటికి ఇబ్బందులూ ఉండవన్నారు. సమావేశంలో కర్ణాటక చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోస్‌‌రాజ్‌‌, కాంగ్రెస్‌‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు