
మక్తల్, వెలుగు : ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వారికి బిల్లులు రాకుంటే.. తన ఇల్లు అమ్మైనా వారికి ఇండ్లు కట్టిస్తానని మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు శుక్రవారం మక్తల్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణం ఎంత త్వరగా ప్రారంభిస్తే.. అంత త్వరగా బిల్లులు వస్తాయన్నారు.
బిల్లులు రాకున్నా నిర్మాణాలను పూర్తి చేసే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలకు ఇండ్లు మంజూరు చేస్తున్నామన్నారు. ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చాలన్న లక్షంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తోందని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.600 కోట్లు తీసుకొస్తానని చెప్పారు.
మక్తల్కు 291 ఇండ్లు మంజూరయ్యాయన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. ఆ హామీని మాత్రం నెరవేర్చుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఇండ్ల ప్రొసీడింగ్స్ అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శంకర్, ఎంపీడీవో రమేశ్ పాల్గొన్నారు.