
- అన్ని వర్గాలకు కాంగ్రెస్ న్యాయం చేస్తున్నది
- ప్రజాపాలనలో జనం సంతోషంగా ఉన్నారని వెల్లడి
- ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు
న్యూఢిల్లీ, వెలుగు: పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ సర్కార్ పేదల సంక్షేమాన్ని విస్మరించిందని మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైరయ్యారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అంటూ హడావుడి చేసిందని, పేదలెవరికీ ఇండ్లు ఇవ్వలేదన్నారు. ప్రజాపాలన హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నదన్నారు. మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఢిల్లీ వెళ్లిన వివేక్.. వరుసగా పార్టీ అగ్రనేతలను కలుస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
అందులో భాగంగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని మంగళవారం కలిశారు. ఆయన వెంట కుమారుడు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఉన్నారు. ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అక్కడి నుంచి నేరుగా ఏఐసీసీ హెడ్ ఆఫీస్ ఇందిరా భవన్కు వెళ్లి పార్టీ సీనియర్ నేతలను కలిసి పలు అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.
సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీ వంటి స్కీమ్లతో ప్రజలకు మేలు జరుగుతున్నదన్నారు. కాంగ్రెస్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ పెద్దలు సూచించారని చెప్పారు. సామాజిక న్యాయం చేయాలన్న రాహుల్ ఆలోచనలను సీఎం రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. రాహుల్ ఆలోచన ప్రతిబింబించేలా మంత్రివర్గ విస్తరణ జరిగిందని చెప్పారు. శాఖల కేటాయింపుపై రేవంత్ రెడ్డి ఢిల్లీలో పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం పనిచేయాలని ఖర్గే, కేసీ వేణుగోపాల్ సూచించారని చెప్పారు.
మంత్రి వివేక్కు ఘన స్వాగతం
శంషాబాద్, వెలుగు: రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న తర్వాత కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లిన మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం హైదరాబాద్కు తిరిగొచ్చారు. ఆయనకు శంషాబాద్ఎయిర్పోర్టులో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. మంత్రివర్గంలో చోటు కల్పించిన అధిష్టానానికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఏ శాఖ అప్పగించినా న్యాయం చేస్తానన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.