
- సింగరేణిలో కొత్త బొగ్గు గనుల కోసం కృషి
- జైపూర్లో మూడో ప్లాంటుతో ఐదు వేల మంది స్థానికులకు ఉద్యోగాలు
- చెన్నూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని వెల్లడి
- సిద్దిపేట, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో మంత్రికి ఘన స్వాగతం
కోల్బెల్ట్/ సిద్దిపేట, వెలుగు: ఇసుక దందాను అడ్డుకోవడంతో పాటు రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చేలా పనిచేస్తానని మైనింగ్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చెప్పారు. నిజాయితీగా పనిచేసి అవినీతి, అక్రమాలను అడ్డుకుంటానన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక, బియ్యం, భూదందాలను అడ్డుకున్నానని, ఇందుకు ప్రజలు సైతం సహకరించారన్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి శనివారం మంచిర్యాల జిల్లాకు వచ్చిన ఆయనకు కాంగ్రెస్ లీడర్లు, అభిమానులు, మాల సంఘం నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా చెన్నూరు నియోజకవర్గంలోని ఇందారం, జైపూర్, భీమారం, చెన్నూరు, రామకృష్ణాపూర్, మందమర్రిలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లలో మాట్లాడారు. ప్రస్తుతం ఇసుక రాయల్టీ ద్వారా రాష్ట్రానికి రూ.700 కోట్ల ఆదాయం వస్తుందని దానిని పెంచాలన్న ఉద్దేశంతోనే సీఎం రేవంత్రెడ్డి తనకు మైనింగ్ శాఖను అప్పగించారని చెప్పారు.
చెన్నూరు ఎమ్మెల్యేగా, పెద్దపల్లి ఎంపీగా ప్రజలకు అందించిన కృషి చూసే అగ్రనేత రాహుల్గాంధీ, సీఎం తనకు మంత్రి పదవి ఇచ్చారన్నారు. కేంద్ర మాజీమంత్రి కాకా వెంకటస్వామి స్ఫూర్తితో ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తానని అన్నారు. చెన్నూరులో గతంలో అహంకారి పాలన సాగిందని, ప్రజలు అతడికి బుద్ధి చెప్పి తనను ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించారని చెప్పారు. తాను ప్రతీ గ్రామంలో రూ.50 లక్షలు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేయిస్తున్నానని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. చెన్నూరు మండలం సోమనపల్లిలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు చేసుకునే విధంగా పోడు రైతులకు హామీ ఇచ్చారు.
సింగరేణికి కొత్త గనులను తీసుకొస్త..
సింగరేణి సంస్థకు కొత్త గనులను తీసుకువచ్చి ఈ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని మంత్రి వివేక్ చెప్పారు. కాకా కుటుంబం పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు నాలుగు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నదన్నారు. జైపూర్ మండలంలో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కాక వెంకటస్వామి, తన అన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కృషి చేశారన్నారు. త్వరలోనే జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో మరో 800 మెగావాట్ల మూడో ప్లాంట్ నిర్మాణ పనులను సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభింపజేస్తామన్నారు. మూడో ప్లాంట్ వల్ల వచ్చే ఐదు వేల ఉద్యోగాలు స్థానికులకు కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సింగరేణి రిటైర్డు కార్మికుల పెన్షన్పెంపు కోసం పార్లమెంటులో కొట్లాడుతున్నారని, ఆయన చొరవతో పెన్షన్ ఫండ్కు రూ.144 కోట్లు జమ చేయించి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పంపిణిపై భరోసా కల్పించారన్నారు. సింగరేణి ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో నిర్మించుకున్న ఇండ్లకు 76జీవో ప్రకారం ఇచ్చే పట్టాల ప్రక్రియను నిలిపివేశారని, దాన్ని పునరుద్ధరించాలని ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకవెళ్లానని చెప్పారు. రూ.100 కోట్లతో అమృత్స్కీం ద్వారా క్యాతనపల్లి, మందమర్రి, చెన్నూరు మున్సిపాలిటీల్లో డ్రింకింగ్ వాటర్ సప్లై పనులు సాగుతున్నాయన్నారు.
వర్షంలోనూ ఘన స్వాగతం
రాష్ట్ర కార్మిక, ఉపాధి, కల్పన, ఫ్యాక్టరీస్, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, దళిత సంఘాల నాయకులు ఘనస్వాగతం పలికారు. భారీ గజమాలలు వేసి అభిమానాన్ని చాటుకున్నారు. పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సత్కారించారు. చెన్నూరు పట్టణంలో వర్షం సైతం లెక్కచేయకుండా గుస్సాడీ కళాకారులతో కలిసి మంత్రి ప్రజలకు అభివాదం చేస్తూ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం చెప్పారు. పెద్దపల్లి జిల్లా దాటి మంచిర్యాల జిల్లాలో ప్రవేశించే క్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి గోదావరినదికి పూజలు చేశారు. తెలంగాణ తల్లి, డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్, తెలంగాణ అమరుల స్తూపానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రామకృష్ణాపూర్లోని ఏరియా ఆసుపత్రి వద్ద సింగరేణి కార్మికుడి విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్సీ బి.వెంకట్రావు, సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్యతో కలిసి
ఆవిష్కరించారు.
అడుగడుగునా నీరాజనం
సిద్దిపేట జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నీరాజనం పట్టారు. గజ్వేల్ మండలం రిమ్మన గూడ, సిద్దిపేట పట్టణ శివార్ల లోని రంగథాంపల్లి అమర వీరుల స్తూపం వద్ద పార్టీ శ్రేణులు మంత్రికి స్వాగతం పలికారు. గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద ఆయనకు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట డీసీసీ ప్రెసిడెంట్ తూముకుంట నరసారెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు మంత్రికి గజమాలతో ఘన స్వాగతం పలికారు. సిద్దిపేట పట్టణ శివార్లలో రంగథాంపల్లి వద్ద తెలంగాణ అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం సిద్దిపేట పార్టీ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ నేతృత్వంలో కార్యకర్తలు వివేక్ను శాలువాలతో సన్మానించారు. మాల మహానాడు నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూల గుచ్చాలు, శాలువాలతో సన్మానించారు.
కాంగ్రెస్ పునర్ వైభవానికి కృషి చేయాలి
ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పునర్ వైభవానికి కార్యకర్తలు, నాయకులు కలసికట్టుగా కృషి చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ పిలుపునిచ్చారు. చెన్నూరు వెళ్తున్న క్రమంలో గజ్వేల్, సిద్దిపేటల్లో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ వారంలో ఒకరోజు సిద్దిపేటకు కేటాయిస్తాని మీ సమస్యలు ఏమున్నా తన దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన ప్రచారం చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ జెండా ఎగిరేలా కార్యకర్తలు పనిచేయాలని చెప్పారు. త్వరలో సమీక్షా కార్యక్రమం నిర్వహించి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంపై నాయకులు, కార్యకర్తల అభిప్రాయంతో నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.