
హైదరాబాద్: మంత్రి వివేక్ వెంకటస్వామి కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి దంపతులకు వివేక్ వెంకటస్వామి దంపతులు శాలువా కప్పి సత్కరించారు. సీఎంకు పుష్పగుచ్చం అందజేసి కేబినెట్లో అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంతో మంత్రి వివేక్ వెంకటస్వామి ముచ్చటించారు. సీఎం కూడా కాకా వెంకటస్వామితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో పలు విషయాలను సీఎం రేవంత్ రెడ్డి పంచుకున్నారు.
రాష్ట్ర ఎకానమీకి అత్యంత కీలకమైన మైనింగ్ శాఖ బాధ్యతలను మంత్రి వివేక్ వెంకటస్వామికి సీఎం రేవంత్ రెడ్డి కేటాయించిన సంగతి తెలిసిందే. గనుల ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు కార్మికుల సంక్షేమం, ఉపాధి, శిక్షణ కార్యక్రమాల నిర్వహణ లాంటి కీలక బాధ్యతలు ఆయనకు అప్పగించారు. వివేక్కు ఉన్న అనుభవం, రాజకీయ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ శాఖలను కేటాయించారు.
►ALSO READ | మంత్రి వివేక్ వెంకటస్వామికి అభినందనలు తెలిపిన మాలమహానాడు నాయకులు
గతంలో వివేక్ తండ్రి దివంగత గడ్డం వెంకటస్వామి (కాకా) కూడా1978–1982 మధ్య ఉమ్మడి ఏపీలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. కేంద్రంలోనూ కార్మిక మంత్రిత్వ శాఖను నిర్వహించారు. వివేక్ అన్న గడ్డం వినోద్ కూడా ఉమ్మడి ఏపీలో వైఎస్ హయాంలో 2004 నుంచి 2009 వరకు కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు. ఇలా వివేక్ కుటుంబానికి కార్మికులతో సుదీర్ఘ అనుబంధం ఉన్న నేపథ్యంలో ఆయనకు దీనితోపాటు ఉపాధి, మైనింగ్ శాఖలు నిర్వహించే అవకాశం దక్కింది.