- అధికారంలో ఉండి చేయనోళ్లు.. ప్రతిపక్షంలో ఉండి ఏం చేస్తరు?: మంత్రి వివేక్ వెంకటస్వామి
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవుతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. పదేండ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయని బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఏం చేయగలరని ప్రశ్నించారు. గురువారం షేక్పేట డివిజన్లోని ఆదిత్య టవర్స్లో నిర్వహించిన గణపతి పూజకు వివేక్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షేక్పేట ప్రజలు తనపై చాలా ప్రేమ చూపారని, ఎన్నికల తరువాత తాను షేక్పేటలోనే ఉంటానని తెలిపారు. షేక్పేటలో రూ.115 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు జరుగుతున్నాయని, ఇప్పటి వరకు రూ.60 కోట్ల పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఈ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని తెలిపారు. ‘‘జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విద్యావంతుడు.
ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈ ప్రాంత ప్రజలపై ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నవీన్ యాదవ్పై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ను గెలిపించాలి” అని వివేక్ కోరారు.
