
- కొత్త గనులు వచ్చి, ఉత్పత్తి పెరిగితేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి: వివేక్ వెంకటస్వామి
- సింగరేణి సంస్థతోనే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఆర్థికాభివృద్ధి
- ప్రజల కోసం పని చేసినప్పుడే గౌరవం దక్కుతుంది
- లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రోసీడింగ్స్ అందజేసిన మంత్రి
కోల్బెల్ట్/గజ్వేల్, వెలుగు: సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామని, వారి సంక్షేమం, ప్రయోజనాలను కాపాడుతామని మైనింగ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. తెలంగాణలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, సంస్థ మనుగడపైనే పెద్దపల్లి పార్లమెంట్ ప్రాంత అభివృద్ధి ఆధారపడిందని చెప్పారు. ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో మంత్రి వివేక్ పర్యటించారు.
మందమర్రిలోని బీ-1 ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు. అలాగే, అదే మండలంలోని సండ్రోనిపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల ప్రోసీడింగ్స్ను పంపిణీ చేశారు. తర్వాత సారంగపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ, తన తండ్రి కాకా వెంకటస్వామి ఆయన జీవితమంతా కార్మికుల హక్కుల కోసమే పనిచేశారన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని 53 రోజులు సమ్మె చేసిన ఐడీపీఎల్ కార్మికులకు కాకా అండగా నిలిచారని, తమ కుటుంబ సభ్యులందరం కలిసి వారికి భోజనాలు పెట్టామని గుర్తుచేశారు.
సింగరేణి నష్టాల బారిన పడినప్పుడు ఆయన ఎన్టీపీసీ నుంచి లోన్ ఇప్పించి సంస్థ, లక్ష మంది కార్మికుల ఉద్యోగాలను కాపాడారన్నారు. సింగరేణి అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ సంస్థగా మారడం వెనుక కాకా కృషి ఉందని చెప్పారు. కార్మికులకు పెన్షన్ స్కీం తీసుకొచ్చిన ఘనత కూడా ఆయనదేనన్నారు. కార్మికుల కోసం నిరంతం పరితపించిన తన తండ్రి బాటలోనే తాను కూడా సేవ చేస్తానన్నారు.
కొత్త బొగ్గు గనులతోనే ఉద్యోగాలు..
సింగరేణిలో వరుసగా గనులు మూతపడుతున్నాయని, కొత్త గనులను పొంది, ఉత్పత్తిని పెంచితేనే.. యువతకు ఉద్యోగాలు వస్తాయని మంత్రి వివేక్ అన్నారు. కొత్త బొగ్గు గనులు దక్కించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఓపెన్ ఆక్షన్లో సింగరేణి సంస్థ పాల్గొనాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి సంస్థ తెలంగాణలోని గనుల కోసం వేలంలో పాల్గొనకుండా అడ్డుకుందన్నారు.
ఒడిశాలోని నైనీబ్లాక్ను దక్కించుకున్నా అక్కడి వారికే ఉపాధి లభిస్తుందని చెప్పారు. పెద్దపల్లి పార్లమెంటు ప్రాంతం, చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగడానికి సింగరేణి ద్వారా సమకూరే డీఎంఎఫ్టీ, సీఎస్ఆర్ ఫండ్స్ కారణమన్నారు. కాకా వెంకటస్వామి ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టు కోసం కృషి చేశారని, అయితే, కమీషన్లకు ఆశపడి మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారన్నారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్లు, మిషన్ భగీరథ ద్వారా రూ.60 వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడయ్యాడన్నారు.
ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకే మైనింగ్ శాఖ..
రాష్ట్రంలో ఇసుక మాఫియాను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వివేక్ వెల్లడించారు. ప్రత్యేక ఇసుక రీచ్లను ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం వినియోగదారులకు అందించనున్నట్టు చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన ఆరు నెలల్లోనే ఇసుక దందాను అడ్డుకున్నానని, ఇది చూసే సీఎం రేవంత్ రెడ్డి తనకు మైనింగ్ శాఖ కేటాయించారని తెలిపారు.
ఇసుక రాయల్టీ పెంచి రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చుతానని చెప్పారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్, మాజీ ఎమ్మెల్సీ బి.వెంకట్రావుతో కలిసి 419 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రోసీడింగ్స్ను, ఆరుగురు రైతుల కుటుంబాలకు రైతు బీమా చెక్కులను అందజేశారు.
కలిసి పనిచేద్దాం.. స్థానిక ఎన్నికల్లో గెలుద్దాం..
కాంగ్రెస్ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీకి ఘన విజయం అందించాలని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్లలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సిద్దిపేట జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని, మాట్లాడారు. పార్టీ సమస్యలతో పాటు ప్రజా సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని కార్యకర్తలకు సూచించారు.
ప్రజల కోసం పనిచేసినప్పుడే గౌరవం దక్కుతుందని, మనం చేసిన మంచి పనులే ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేస్తేనే ఆదరణ దక్కుతుందని చెప్పారు. కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టలేదు కానీ.. కాళేశ్వరంలో ఎలా దోచుకోవాలో అనే ఆలోచనే చేశారన్నారు. కాళేశ్వరానికి ఖర్చు పెట్టిన డబ్బులతో రాష్ట్రంలోని నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టే అవకాశం ఉండేదని, కానీ కమీషన్లు వచ్చే వాటికే ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. ఇలాంటి విషయాలన్నీ ప్రజలకు చెప్తూ ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తే లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు.
మరోవైపు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కొంచెం వీక్గా ఉందని, దానిని పటిష్టం చేసి, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేయాలని సూచించారు. సోషల్ మీడియాను బలోపేతం చేయడానికి మండలాల వారిగా కమిటీలు వేసుకుని పనిచేయాలని కోరారు. తన తండ్రి కాకా వెంకటస్వామి మూడు సార్లు ఎంపీగా పనిచేశారని, ఆయన ఈ ప్రాంతానికి ఇప్పటికీ సుపరిచితులేనని గుర్తుచేశారు.
ఓదెల మల్లన్నకు మంత్రి వివేక్ ప్రత్యేక పూజలు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మల్లన్న ఆలయాన్ని గనులు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు, అభిమానులు ఒగ్గు డోలు చప్పుల్లతో మంత్రిని ఆలయానికి తీసుకెళ్లారు. అనంతరం అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మల్లన్నకు మొక్కులు సమర్పించుకున్న తర్వాత వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడారు. గతంలో కాకా వెంకటస్వామి ఓదెల మల్లన్న గుడి అభివృద్ధికి కృషి చేశారని గుర్తుచేశారు. అలాగే ఎంపీ గడ్డం వంశీకృష్ణతో మాట్లాడి ఎంపీ నిధుల నుంచి ఆలయ అభివృద్ధికి కృషి చేసేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాకా కుటుంబ అభిమానులు పాల్గొన్నారు.