ఉద్యోగులకు రెండు డీఏలు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

ఉద్యోగులకు రెండు డీఏలు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

హైదరాబాద్: ఉద్యోగుల డిమాండ్లపై తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. ఉద్యోగులకు రెండు డీఏలు ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక డీఏ ఇప్పుడు చెల్లిస్తామని, మరో డీఏ 6 నెలల తర్వాత ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. డీఏల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుందని భట్టి గుర్తుచేశారు. ఉద్యోగుల ఆరోగ్యానికి సంబంధించి ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. ఉద్యోగులు ఆరోగ్య బీమాకు ప్రతి నెల 500 రూపాయలు చెల్లిస్తే ప్రభుత్వం కూడా కొంత చెల్లిస్తుందని మంత్రి వర్గం తెలిపింది. ఉద్యోగులు, ప్రభుత్వం చెల్లించే డబ్బులను ట్రస్టులో జమ చేస్తామని పేర్కొంది.

ఉద్యోగులకు సంబంధించిన బిల్లుల పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని, నెలల వారీగా క్లియర్ చేస్తామని భట్టి తెలిపారు. నెలకు 700 కోట్ల రూపాయలకు తగ్గకుండా ఉద్యోగుల పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని చెప్పారు. ఎన్నికల సమయంలో చేసిన ఉద్యోగుల బదిలీలను వెనక్కి తీసుకొస్తామని, ఉద్యోగులు నర్సింగ్ డైరెక్టరేట్ కోరారని.. కేబినెట్ అందుకు అంగీకరించిందని మంత్రులు తెలిపారు. అంగన్వాడీ ఉద్యోగుల రిటైర్మెంట్ బెన్ ఫిట్స్ ను రూ.2 లక్షల వరకూ పెంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు అద్దెకు తీసుకున్న వాహన బిల్లులు చెల్లించాలని నిర్ణయించింది.

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు:
* కొత్తగూడెంలోని ఎర్త్ సైన్స్ వర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయం
* మహిళా స్వయం సహాయక బృంద సభ్యుల ప్రమాద బీమా చెల్లింపునకు నిర్ణయం
* మహిళా స్వయం సహాయక బృంద సభ్యులు మరణిస్తే రూ.10 లక్షలు ఇచ్చేందుకు నిర్ణయం
* 2024లో 385 మహిళా స్వయం సహాయక బృంద సభ్యులు మరణించారు
* 385 మహిళల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున బీమా పరిహారం
* హమ్ విధానంలో గ్రామీణ రోడ్ల ఆధునీకరణకు నిర్ణయం
* సన్న వడ్లకు రూ.500 బోనస్ కొనసాగింపు
* ప్రతీ గ్రామానికి బీటీ రోడ్లు వేయాలని నిర్ణయం
* రెండు సంవత్సరాలలో రోడ్లు నిర్మిస్తాం
* మెట్రోను విస్తరించడానికి కేబినెట్ నిర్ణయం
* 86.1 కిలోమీటర్లు.. 19 వేల 75 కోట్లతో మెట్రో విస్తరణ: పొంగులేటి